తెలంగాణ కాంగ్రెస్ లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంగా హాట్ హాట్ గా నడుస్తొంది. బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికీ తన నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలు, అభిమానులతో పలు మార్లు సమావేశాలు నిర్వహించారు. తన మనసులో మాటను వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడకుండా ఉండేందుకు పలువురు కీలక నేతలు బుజ్జ గింపుల పర్వం కొనసాగించారు. అయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి మెత్తబడలేదని తెలుస్తొంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారంతో పాటు పార్టీలోచేరిక అంశంపై తెలంగాణ ముఖ్య నేతలతో చర్చించేందుకు హైకమాండ్ సిద్దమైంది. పార్టీ ముఖ్య నేతలను ఢిల్లీకి ఆహ్వానించినట్లు తెలుస్తొంది. ఈ రోజు (సోమవారం) సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ కు సమంబంధించి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉండగా, పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి ఢిల్లీకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఢిల్లీకి వెళ్లేందుకు ఆయన ఆసక్తి చూపనట్లు తెలుస్తొంది. ఇక్కడి పరిణామాలపై చర్చించేందుకు అవసరమైతే ఫోన్ లో అందుబాటులో ఉంటానని జానారెడ్డి పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలిసింది. ఈ సమావేశంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో పార్టీ హైకమండ్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితిలో రాజగోపాల్ రెడ్డి ని పార్టీ వదులుకోవడానికి సిద్ధం లేదు. ఆయన విషయంలో పార్టీ సీనియర్ నేతలు అనుసరిస్తున్న వైఖరే అందుకు నిదర్శనంగా కనబడుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానంలో వేరే ఇంకెవరైనా నాయకుడు అయితే ఈ పాటికే షోకాజ్ నోటీసు జారీ చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకునే వారని అంటున్నారు. నియోజకవర్గంలో సొంత క్యాడర్ ఉండి బలమైన నేతగా ఉన్నందున రాజగోపాల్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచిచూసి అడుగులు వేస్తొంది. రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపిగా, సీనియర్ నేతగా ఉన్నారు.ఈ తరుణంలో పార్టీ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.