Congress Leader : తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాగా అభిమానించే కొండా మురళి దంపతులు ఆయన మరణానంతరం జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు అందులోకి వచ్చారు.
మురళి భార్య కొండా సురేఖ తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసి జగన్ కు జై కొట్టారు.అయితే 2012 లో జరిగిన ఉప ఎన్నికలో ఆమె ఓడిపోయారు.తదుపరి జగన్ కూడా కొండా దంపతులను దూరం పెట్టడంతో వారు అనివార్యమై టీఆర్ఎస్లో చేరారు.2014 లో సురేఖ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కానీ 2018 ఎన్నికల్లో సురేఖకు కెసిఆర్ టిక్కెట్ ఇవ్వలేదు.తదనంతరం వారు మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. తెలంగాణాలో రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల పార్టీ పెడుతున్న నేపథ్యంలో కొండా దంపతులు అందులోకి వెళతారని వదంతులు వస్తుండగా కొండా మురళి క్లారిటీ ఇచ్చారు.
Congress Leader : పది వేల కోట్లు ఇచ్చినా పార్టీ మార౦
తాను పార్టీ మారితే షర్మిల పదివేల కోట్లు ఇస్తుందని, కానీ తనకు విలువలే ముఖ్యమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొండా మురళీ అన్నారు. వరంగల్ మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి.. అధికార పార్టీని ఎలా ఎదుర్కొవాలి అనేదానిపై చర్చించారు.
జగన్ పై గుస్సా!
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.‘షర్మిల పార్టీ నుంచి పిలుపు వచ్చింది.. కానీ ఎట్టి పరిస్థితుల్లో రామని చెప్పాం. నేను పార్టీ మారితే షర్మిల పదివేల కోట్లు ఇస్తది, కానీ నాకు విలువలు ముఖ్యం. జగన్ను జైలు నుంచి తీసుకొచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశా. తర్వాత జగన్ కనీసం పలకరించలేదు. మేం పార్టీ మారే అవకాశం లేదు. కాంగ్రెస్లోనే కొనసాగుతాం. కాంగ్రెస్కు పూర్వవైభవం తెద్దాం. జనంలో తిరిగే నాయకుడు కాంగ్రెస్కు అవసరం. నేను కరోనాతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చాను.
ఆసందర్భంలో చాలా మంది టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్తో తట్టుకుంటవా అని అప్పట్లో హరీష్ రావు అన్నారు. చంద్రబాబుతోనే ఫైట్ చేశా.. కేసీఆర్ ఎంత అన్నాను. మునిసిపల్ ఎన్నికల్లో అందరూ నామినేషన్లు వేయండి.. దానితో పాటు విత్ డ్రా ఫామ్ కూడా ఇవ్వండి. పార్టీ చెప్పిన వారికే టికెట్లు ఇస్తాం. టికెట్లు తీసుకుని అమ్ముడు పోవద్దు. మీ వెనక మేమున్నాం. నిజాయితీగా ఉండండి’ అని కొండా మురళీ అన్నారు.
ఏబీసీడీలు రాని మంత్రి!
పనిలో పనిగా మంత్రి దయాకర్ రావు మీద కూడా ఆయన పంచ్ లు విసిరారు. ఏబీసీడీలు రాని మంత్రి దయాకరరావుకు అవార్డులు వస్తున్నాయని.. అసలు ఆయన నా మనుమరాలు చదివే ఏబీసీడీలైనా చదవగలరా?’ అని కొండా మురళి ఎద్దేవా చేశారు.వరంగల్ ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని సవాల్ విసిరారు.