భువనగిరి పార్లమెంట్ సభ్యుడు (ఎంపి), సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలక వీడారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి ఒకే చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల పార్టీ ఇన్ చార్జి బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ వద్రాతో భేటీ అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మనసు మార్చుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ ల వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తొలుత మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటానని ప్రకటించారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో ప్రియాంక నేతృత్వంలో టీపీసీసీ ముఖ్యనేతల సమావేశానికి సైతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి హజరు కాలేదు. ఆ రోజు ఉదయం ఢిల్లీలోనే ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకున్నారు. తాను సమావేశానికి ఎందుకు హజరు కావడం లేదు అన్న అంశంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి .. సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆ లేఖలో రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్ ల వ్యవహారాల శైలిపై అసంతృప్తి తెలియజేశారు. అయితే టీపీసీసీ నేతలతో ప్రియాంక గాంధీ జరిపిన భేటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో చర్చించిన తర్వాత మునుగోడు ఉప ఎన్నికలకు అభ్యర్ధిని ఖరారు చేయాలని, ఆయన సూచనలు, సలహాలు తీసుకోవాలని నేతలకు సూచించారు.
ఆ మరుసటి రోజే ప్రియాంక గాంధీ కబురుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీకి వెళ్లి భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. దాదాపు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రియాంక భేటీ అయ్యారు. ఆ సమావేశంలో కోమటిరెడ్డికి ప్రియాంక గాంధీ ఏమి చెప్పారో ఏమో కానీ ఆయన కూల్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి సిద్దమని స్పష్టం చేశారు. పార్టీ ఎప్పుడు ఆదేశించినా ప్రచారానికి వెళ్తానని చెప్పారు వెంకటరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తోనూ కోమటిరెడ్డి చర్చించారు. పార్టీ బలోపేతానికి నాయకులందరూ కలిసి పని చేయాలని ప్రియాంక గాంధీ సూచించారని చెప్పిన కోమటిరెడ్డి.. ప్రియాంక గాంధీతో చర్చించిన పార్టీ అంతర్గత విషయాలను తాను మీడియాకు చెప్పబోనని పేర్కొన్నారు. సో.. ప్రియాంక దౌత్యంతో ఎట్టకేలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మెత్తబడ్డారు. ప్రచారానికి ఒకే చెప్పేశారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్ధిగా ఆయన రంగంలోకి దిగనున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు ప్రధాన రాజకీయ పక్షాలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు లైన్ క్లీయర్ .. ఆ హోదా వచ్చేసినట్లే..!!