Congress: కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇటీవల ముఖ్యనేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో షాక్ తినడం కాంగ్రెస్ వంతు అయింది.
ఆ సంఘటనతో…
ఇటీవల ఫేక్ వ్యాక్సిన్ వివాదానికి సంబంధించి మమతా బెనర్జీకి మద్దతుగా అభిజిత్ ట్విట్టర్ వేదికగా తన వాయిస్ వినిపించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోడీ సర్కార్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో అభిజిత్ తృణమూల్ చేరతారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. కోల్కతాలో గత నెలలో టీఎంసీ నేత, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని అభిజిత్ ముఖర్జీ కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో టీఎంసీ నేతలతో అభిజిత్ పార్టీ మారే విషయంపై సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. ఆ అంచనాలు నిజం చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అభిజిత్ చేరిపోయారు.
గతంలో నో చెప్పి…
గతంలో ఎంపీగా పనిచేసిన ముఖర్జీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీ చీఫ్ గానూ వ్యవహరించారు. జంగిపూర్ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు గెలుపొందారు. ఇటీవల ఆయన స్నేహితుడు జితిన్ ప్రసాద వలే ముఖర్జీ సైతం కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, తాను కాంగ్రెస్ లోనే ఉంటానని, టీఎంసీ లేదా ఇతర పార్టీలో చేరతాననే ప్రచారం అవాస్తవమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం టీఎంసీలో ఉన్న తన తండ్రి సహచరులే ఇలాంటి వదంతులకు కారణమని ముఖర్జీ పేర్కొన్నారు.అయితే, తాజాగా ఆయన పార్టీ కండువా మార్చుకోవడం గమనార్హం.