ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా…. కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు, అంతర్గత సంక్షోభాలు తెరమీదకు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా
సంచలనం సృష్టించిన రాజస్థాన్ సంక్షోభం కొలిక్కి రాగానే… కాంగ్రెస్ పార్టీలో మరో సంక్షోభం తలెత్తింది. పార్టీ నాయకత్వాన్ని మార్చాలంటూ ఇటీవల సోనియాకు 23 మంది నేతలు లేఖ రాసి కలకలం రేకెత్తించారు. ఈ వివాదం సద్దుమణుగుతున్న సమయంలోనే ఈ లేఖ రాసిన నేతల్లో ఒకరి టార్గెట్గా మరికొందరు స్పందించారు.
ఆ లేఖ మంట పుట్టించింది.
కాంగ్రెస్లో నాయకత్వ మార్పు లేఖ రాసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. లఖింపూర్ ఖేరి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఈ మేరకు ఒక తీర్మానం చేశారు. ముఖ్యంగా ఆ నియోజక వర్గం మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ మేరకు సోనియా గాంధీకి దీనిని పంపారు. దీంతో ఈ లేఖ కాంగ్రెస్ పార్టీలో మరో కలకలం రేపింది.
తండ్రిని కొడుకును…
కాంగ్రెస్ నేతలు తమ పార్టీకి చెందిన మాజీ ఎంపీ తీరుపై ఈ తీర్మానంలో విరుచుకుపడ్డారు. ‘సోనియాకు రాసిన లేఖలో సంతకం చేసిన 23 మందిలో ఉత్తరప్రదేశ్ నుంచి జితిన్ ప్రసాద్ ఒక్కరే ఉన్నారు. ఆయన కుటుంబమంతా గాంధీ కుటుంబానికి వ్యతిరేకం. ఆయన తండ్రి జితేంద్ర ప్రసాద్ సోనియా గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేసి దీన్ని నిరూపించారు. అయినప్పటికీ సోనియా గాంధీ జితిన్ ప్రసాద్కు లోక్సభ టికెట్ ఇవ్వడంతోపాటు ఆయనను కేంద్ర మంత్రిగా చేశారు. ప్రతిఫలంగా ఆయన తాజాగా చేసిన పని అయిన అసమ్మతి లేఖపై సంతకం చేయడం క్రమశిక్షణ కిందకే వస్తుంది. దీంతో ఆయనపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరుతున్నాం’ అంటూ తీర్మానం చేశారు.
ఆయన్ను ఎందుకు టార్గెట్ చేస్తారండి?
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలు జితిన్ ప్రసాద్ను టార్గెట్ చేయడం దురదృష్టకరమని సోనియాకు 23 మంది రాసిన లేఖలో సంతకం చేసిన పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన కపిల్ సిబల్ పేర్కొన్నారు. సొంత పార్టీ నేతలను లక్ష్యంగా చేసి తమ శక్తిని వృధా చేసే బదులు, బీజేపీని టార్గెట్ చేయవచ్చుకదా అని ఆయన పేర్కొన్నారు. కాగా కపిల్ సిబల్ చాలా దూరదృష్టి గల వ్యక్తి అని మనీశ్ తివారీ స్పందించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతల లేఖ వెనుక ఆ రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చూసే ప్రియాంక గాంధీ, లేదా సోనియా గాంధీ ప్రమేయం లేదని కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది.