కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న నిర్ణయంపై యూ టర్న్ తీసుకోబోతున్నదా లేదా అనేది నేడు తేలనుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే మరో పక్క రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలోనూ కొనసాగుతున్నారు. జోడు పదవులు ఆశించి నందువల్లనే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను అధ్యక్ష పదవికి పోటీ చేయవద్దని కాంగ్రెస్ అధిష్టానం చెప్పింది. ఒక వ్యక్తికి ఒకే పదవి అని అప్పట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తో పాటు సీనియర్ నేతలు పేర్కొన్నారు. ఉదయపూర్ సదస్సులో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జోడు పదవులు కుదరదని చెప్పినందు వల్లే అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అధ్యక్ష ఎన్నిక బరి నుండి తప్పుకున్నారు.
మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల సమయంలో రాజ్యసభ లో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ పదవిలోనూ కొనసాగాలని ఆయన అనుకుంటున్నారని సమాాచారం. అయితే ఖర్గే జోడు పదవుల అంశంపై నిర్ణయం తీసుకునేందుకు శనివారం (ఈ రోజు) కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అవుతోంది. ఖర్గే, జైరాం రమేష్, కేసి వేణుగోపాల్ తదితరులు ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఖర్గే కు జోడు పదవులు కొనసాగించే అంశంపై ఒక వేళ పార్లమెంటరీ పార్టీలో ఏకాభిప్రాయం కుదరని పక్షంలో సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్ లేదా చిదంబరం లో ఒకరికి రాజ్యసభ లో ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందని భావిస్తున్నారు.