జైపూర్: మహిళలకు మహిళలే శత్రువులంటే ఇదే కాబోలు. తన పక్కన కుర్చీలో కూర్చున్న మహిళా సర్పంచిని.. కిందకు వెళ్లి స్థానికులతో కలిసి నేలమీద కూర్చోవాలని మహిళా ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే దివ్యా మాడెర్నా ఇలా చెబుతున్న వీడియో వైరల్ అయింది. ఆమె తన నియోజకవర్గమైన ఓషియన్ పరిధిలో గల ఖేటసర్ గ్రామంలో నిర్వహించిన ధన్యవాద సభలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వీడియోలో ఖేటసర్ సర్పంచ్ చందుదేవి తొలుత ఎమ్మెల్యే పక్కన కూర్చున్నారు. కానీ వెంటనే ఎమ్మెల్యే ఆమెను కింద కూర్చోమనడంతో ఆమె కుర్చీ ఖాళీ చేసినట్లు వీడియోలో ఉంది. సర్పంచ్ తొలుత నేలమీదే కూర్చున్నారని, కానీ స్థానికులు మాత్రం సర్పంచి కాబట్టి ఎమ్మెల్యే పక్కన కూర్చోమని అడిగారని ఆమె భర్త రూపరామ్ ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’కు తెలిపారు. కానీ ఎమ్మెల్యే మాత్రం కిందకు వెళ్లమనడంతో సభ జరిగినంత సేపూ కిందే కూర్చున్నారన్నారు. అయితే దేవి చాలా సాధారణంగా ఉండే మహిళ కావడంతో నిరసన ఏమీ వ్యక్తంచేయలేదని రూపరామ్ అన్నారు. అయితే కొందరు మాత్రం దీనిపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.
ओसियां विधायक #divyamaderna एक बार फिर चर्चा में, महिला सरपंच को कुर्सी से उठा कर जमीन पर बैठाने का वीडियो हुआ वायरल pic.twitter.com/qDMUjO8oau
— rpbreakingnews (@rpbreakingnews) March 17, 2019
జైల్లో ఉన్న తండ్రి..
తాను కాంగ్రెస్ పార్టీ సభకు వెళ్లానని, సర్పంచి మాత్రం బీజేపీ కార్యకర్త అని ఎమ్మెల్యే మాడెర్నా అన్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన మాడెర్నా.. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే భేరారామ్ చౌదరిని గత డిసెంబరు ఎన్నికల్లో ఓడించారు. భన్వారీదేవి హత్యకేసులో జైల్లో ఉన్న కాంగ్రెస్ నాయకుడు మహిపాల్ మాడెర్నా కూతురే దివ్య. అయితే దివ్య ఇలా చేయడం ఇది మొదటిసారి ఏమీ కాదు. గతంలో ఒకసారి ఒక పోలీసు అధికారిపై మండిపడ్డారు. ‘ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యే మారారు.. ఇక మీ పనికిమాలిన పనితీరును కూడా మార్చుకోవాల్సిందే’ అని హెచ్చరించిరాు. ఈ వీడియో కూడా బాగా వైరల్ అయింది.
నా కోసం వెతుక్కోవాలి తప్ప..
మరో సందర్భంలో జోధ్ పూర్ ఎస్.డి.ఎం. మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాజస్థాన్ గానీ, జోధ్ పూర్ జిల్లాలో గానీ అందరికంటే ముందుండేది ముఖ్యమంత్రి, తర్వాత జోధ్ పూర్ లో ఉండేది నేనే. మీరు ముఖ్యమంత్రి వద్దకు ఏదైనా అత్యవసరమైన పని మీద వెళ్లారేమో నాకు తెలియదు. మీకు వచ్చిన అంత అర్జంటు పనేంటో కూడా అర్థం కావడం లేదు. ఇలాంటివి మాత్రం నేను సహించేది లేదు మిస్టర్.. మీరు నాకోసం వెతుక్కోవాలి తప్ప నేను అధికారుల కోసం వెతకను’’ అన్నారు. స్థానికులకు వచ్చిన ఓ సమస్యను 15 నిమిషాల్లోగా పరిష్కరించి, తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దాంతో.. వెంటనే చుట్టుపక్కల ఉన్నవాళ్లు ‘దివ్యా మాడెర్నా జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.