Congress working Committee: కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియకు గానూ త్వరలో సంస్థాగత ఎన్నికల నిర్వహించే విషయంపై చర్చించేందుకు ఈ నెల 16న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో సంస్థాగత ఎన్నికలతో పాటు దేశ రాజకీయ పరిస్థితులు, రానున్న అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఇటీవల కాలంలో పార్టీ నుండి పలువురు నాయకులు వెళ్లిపోవడం, పార్టీకి ఎవరు నాయకుడో తెలియని పరిస్థితులు నెలకొనడంతో అంతర్గత విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీడబ్ల్యుసీ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన సీడబ్ల్యుసీ సమావేశంలో జూన్ నాటికి పార్టీ అధ్యక్ష పదవిలో ఎంపికైన నేత ఉంటారని నిర్ణయించారు. అయితే మే 10న జరిగిన సమావేశంలో కోవిడ్ పరిస్థితుల కారణంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ
2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి సోనియా గాంధీనే కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే పార్టీ అధ్యక్ష పదవిలో పూర్తి కాలంపని చేసే క్రియాశీల నేత ఉండాలనీ, పార్టీని ప్రక్షాళన చేయాలని పలు డిమాండ్లు సీనియర్ ల నుండి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు సంస్థాగత ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు ఈ నెల 16న సిడబ్ల్యుసీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Congress working Committee: రాహుల్, ప్రియాంకలకు బాధ్యతలు..?
జాతీయ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ, ప్రియాంక వద్రా ఇద్దరూ జంట నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రియాంక బాధ్యతలు నిర్వహించవచ్చని చెబుతున్నారు. ఎన్నికైన అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ మాత్రమే వ్యవహారిస్తారని పార్టీ అంతర్గత వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ త్వరలో ముగించి ఆ తరువాత ప్లీనరీని నిర్వహించి పార్లమెంటరీ బోర్డు సహా వివిధ సంస్థాగత కమిటీలను నియమిస్తారని అంటున్నారు. రానున్న యూపి, పంజాబ్ ఎన్నికలతో పాటు 2024లో జరిగే ఎన్నికలకు సమాయత్తమయ్యే విధంగా నూతన నాయకత్వం ఏర్పడుతుందని భావిస్తున్నారు.