ఏలూరును గజగజలాడిస్తున్న వైరస్కు సంబంధించి పరస్పర విరుద్ధమైన నివేదికలు రావడంతో అక్కడ వారి అస్వస్థతకు ఏది కారణం అన్నది ఇంకా మిస్టరీగానే మిగిలింది. వైరస్ వల్ల ఆహారం, నీళ్లు కలుషితం అయి ఉండొచ్చని మంగళగిరి ఎయిమ్స్ తాజాగా ఇచ్చిన ప్రాథమిక నివేదిక అనుమానం వ్యక్తం చేసింది.
భార లోహాలు లేదా రసాయన మూలకాలు కలవడం వల్ల కూడా ఇలా జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేసింది. ఏలూరులో ఈ ఒకటో తారీకు నుంచే ఉందని,అప్పట్లోనే కొంతమంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరినట్లు తేల్చింది.అయితే ఐదో తేదీ రాత్రి 8గంటల తర్వాత ఒక్కసారిగా కేసుల సంఖ్య భారీగా పెరిగిందని నిర్థారించింది. కాగా ఏలూరులోని మొత్తం 77వార్డ్డుల్లో 34వార్డుల్లోనే ఈ పరిస్థితి ఉందని కమిటీ గుర్తించింది. అయితే ఈ 34వార్డులకు పంపుల చెరువు నుంచే నీరు సరఫరా అవుతోంది. ఏలూరు మున్సిపాలిటీ ఈ నీటిని సప్లయ్ చేస్తోంది.ఇదిలా ఉండగా మంచినీరు లేదా ఆహారం విషపూరితం కావొచ్చని ఎయిమ్స్ నివేదిక పేర్కొంటుండగా విజయవాడ ల్యాబు ఫలితాలు మాత్రం నీటిలో ఎలాంటి ఇబ్బందులు లేవని తేల్చాయి.
మంచినీటిలో ఎలాంటి భారలోహాలు కలవ లేదని నీరు వినియోగానికి అనుకూలమైనవేనని ఆ రిపోర్టులు తేల్చాయి. బాధితుల రక్త నమూనాలు నార్మల్గానే ఉన్నట్లు గుర్తించారు. డెంగ్యూ, చికెన్ గున్యా కూడా కారణం కాదని నిపుణులు తేల్చి చెప్పారు.సీటీ స్కాన్ రిపోర్టు కూడా నార్మల్ గానే ఉన్నట్లు గుర్తించారు. 14 వాటర్ శాంపిల్స్ను నిపుణులు పరిశీలించారు. నీటిలో ఎలాంటి కలుషితాలూ లేవని నిర్ధారణ చేశారు.ముందుగా భారలోహాల నిర్ధారణ కోసం నీటిని విజయవాడ ల్యాబ్కు పంపించారు. అయితే విజయవాడ పరీక్షల్లో నీరు సురక్షితమేనని నిర్ధారణ చేస్తూ నివేదిక వచ్చింది. కాగా బాధితులందరికీ ర్యాపిడ్ కోవిడ్ పరీక్షలు జరుపగా అందరికీ నెగెటివ్ రిజల్ట్ వచ్చాయి.
ఇదిలా ఉండగా కొన్నిరోజులుగా నీటి రంగు మారినట్లు కొందరు బాధితులు చెప్పారని నిపుణులు తెలిపారు. వైరస్ కలిసిన నీళ్లు లేదా ఆహారం కారణం కావచ్చని స్థానికులు కూడా అనుమానిస్తున్నారు. భారలోహాలు లేదా రసాయన మూలకాలు కారణం కావచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఎయిమ్స్ ప్రాథమిక నివేదికలో ఈ అంశాలనే పేర్కొన్నారు.కానీ విజయవాడ ల్యాబ్ మాత్రం నీరు అత్యంత సురక్షితమైందని పేర్కొనడం విశేషం.అదే నిజమైతే అసలు ఏలూరు ప్రజలు ఎందుకు అస్వస్థులయ్యారు దానికి కారణాలేంటన్నది మాత్రం తేలాల్సి ఉంది. ప్రజలు మాత్రం నీటి కాలుష్యంపైనే ప్రధానంగా అనుమానాలు వ్యక్తం చేశారు.ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ వింత పరిస్థితికి కారణం ఏమిటో ఎంత త్వరగా బయటపెడితే అంత మంచిదంటున్నారు.