ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే అజాత శత్రువు. అందరినీ ఆప్యాయంగా పలకరించడం, అందరితో కలుపుగోలుగా ఉండడం, ఎంత చిన్న వాళ్ళ ముందైనా గర్వం లేకుండా, పెద్ద వాళ్ళ ముందు వినయం తక్కువ కాకుండా ఎస్పీ బాలు ప్రయాణం అనితరసాధ్యం. అసలు తన జీవితంలో ఎటువంటి వివాదాలు లేకుండా సాగిపోయినా తన ప్రాణ స్నేహితుడు ఇళయరాజాతో వివాదం రూపంలోనే ఒక మాయని మచ్చ మిగిలిపోవడం నిజంగా బాధాకరం.
ఎస్పీ బాలు – ఇళయరాజా కాంబినేషన్ అంటే అది మ్యాజిక్ అనే చెప్పాలి. ఎన్నో వందల పాటలు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. ఇళయరాజా, బాలు ఇద్దరూ ఒకర్ని ఒకరు ఒరేయ్ అని సంభోదించుకునేంత చనువు. అలాంటి ఇద్దరి మధ్య వివాదమేంటి? అసలు విషయంలోకి వెళ్తే… బాలు 50 పేరుతో ఎస్పీ చరణ్ ఒక సంగీత కచేరిని యూఎస్ లో ప్లాన్ చేసాడు. ఎస్పీ బాలు, చరణ్, తమ టీమ్ తో కలిసి యూఎస్ వెళ్లారు.
అయితే యూఎస్ వెళ్ళగానే వాళ్లకు నోటీసులు స్వగతం పలికాయి. ఇళయరాజా తన పాటలు పాడకూడదని ఎస్పీ బాలుకు నోటీసులు పంపించారు. ఈ విషయంలో బాలు చాలా తీవ్రంగా హర్ట్ అయ్యారు. తన స్నేహితుడు అనుకున్న వ్యక్తి ఇలా చేయడమేంటి అని నొచ్చుకున్నారు. తనతో ఒక్క మాట చెప్పి ఉంటే సరిపోయేది కదా, తామిద్దరి మధ్యా ఈ వివాదం ఉండాలి కానీ ప్రపంచం మొత్తానికి తెలియడమెందుకు అని మనసును కష్టపెట్టుకున్నారు. తన జీవితంలో ఈ సంఘటన మాయని మచ్చ అని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు బాలు.
ఇళయరాజా ఇలా చేయడం వెనుక ఉన్న కారణం బాలుకు తర్వాత తెలిసింది. ఇళయరాజా సంగీత కచేరి పెడదామనుకుని బాలుని పిలిచారు. దానికి బాలు చెప్పిన అమౌంట్ ఇళయరాజాకు నచ్చలేదు. దాంతో కొత్తవాళ్ళతోనే ఆ కచేరిని పూర్తి చేసారు. అయితే తనకు సరైన అమౌంట్ చెప్పకుండా యూఎస్ లో బాలు కన్సర్ట్ చేయడం ఈ సంగీత జ్ఞానికి నచ్చలేదు. అప్పటినుండి బాలు ఇళయరాజా పాటలను పాడింది లేదు.