కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుంటోంది. రోజురోజుకీ మహమ్మారి మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. శనివారం ఆదివారం మధ్య గడచిన 24 గంటల్లో ఏకంగా 1.83 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది.
వీటిలో అత్యధికంగా బ్రెజిల్ లో 54771 అమెరికాలో 36617 భారత్ లో 15413 కేసులు నమోదయ్యాయి. వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచడం లాక్ డౌన్ ఆంక్షలు సడలించడం వంటి కారణాల వల్లే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇకపోతే ఇప్పటి వరకు 90 లక్షల కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదు కాగా.. వీరిలో 4.70 లక్షల మంది మృతిచెందారు. వీరిలో దాదాపు 9వేల మంది గడచిన 24 గంటల వ్యవధిలోనే మరణించినట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది. మరొక వారం రోజుల్లో కోటి కేసుల మైలురాయిని దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు లాటిన్ అమెరికా దేశాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్టు జాన్ హాప్కిన్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బ్రెజిల్లో తొలిసారిగా ఒక్క రోజు వ్యవధిలో 50 వేలకు పైగా కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్యారోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఇక అక్కడ చనిపోయిన వారి సంఖ్య కూడా 50 వేలు దాటింది.