Maharashtra: మహారాష్ట్ర Maharashtra థర్డ్ వేవ్.. ఈ మాట వినటానికే భయం పుట్టిస్తోంది. ఇందుకు కారణం దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ మొదలైంది మహారాష్ట్రలోనే అనే మాట ఇప్పటికీ చెప్తారు. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ఆనవాళ్లు లేని సమయంలోనే మహారాష్ట్రలో రోజుకి వేలల్లో కేసులు నమోదవడంతోపాటు అమరావతి, నాగ్ పూర్ వంటి ప్రాంతాల్లో లాక్ డౌన్ అమల్లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ మహారాష్ట్రలో ప్రారంభమైందనే వార్త కంగారు పుట్టిస్తోంది. మరీ ముఖ్యంగా అక్కడ చిన్నారుల్లో ఈ థర్డ్ వేవ్ ప్రతాపం చూపిస్తోందనే వార్త మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఏకంగా ఆ రాష్ట్రంలో 8వేల మంది చిన్నారులకు కరోనా సోకడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
రెండు నెలల క్రితమే రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే.. ‘థర్డ్ వేవ్ కోసం మేం ఇప్పటినుంచే సిద్ధమవుతాం’ అని చేసిన ప్రకటన ఇప్పుడు నిజమవుతున్నట్టే అనిపిస్తోంది. ప్రస్తుతం రోజువారీ లెక్కల ప్రకారం సెకండ్ వేవ్ తగ్గుతుందనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మహారాష్ట్రలో.. అదీ చిన్నారులపై కరోనా పంజా విసురుతోందనే వార్త స్వతహాగా ఎవరినైనా హడలెత్తించేదే. ఎందుకంటే సెకండ్ వేవ్ మహారాష్ట్రలో మొదలై దేశం మొత్తాన్ని గుప్పిట్లలో పట్టేసి ఊపిరాడకుండా చేసింది. ఇప్పుడు మహారాష్ట్రలో పిల్లల్లో పెరుగుతున్న కేసులతో మళ్లీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ కావాల్సి ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు. మహారాష్ట్రతో సరిహద్దు ఉన్న తెలంగాణ ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. నీలోఫర్ ఆసుపత్రిలో వెయ్యి పడకలు సిద్ధం చేస్తోందని సమాచారం.
Read More: Foreign media: భారత్ పై విదేశీ మీడియా విషం..! మంచిని దాచి చెడు చూపే ప్రయత్నం..!
తెలంగాణలో పరిస్థితులు తీవ్రమైతే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఏపీపై ఉంటుంది. సెకండ్ వేవ్ లో ఆ పరిస్థితి చూశాం. దీంతో ఇప్పుడు ఏపీలో కూడా అలెర్ట్ కావాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మహారాష్ట్రలో పరిస్థితులు నిజమే అయితే.. ఆందోళనకర పరిస్థితులు తప్పవు. ఉత్తరాదిలో మొదలైన మిడతల దండు తెలంగాణ వరకూ వచ్చినట్టు.. మహారాష్ట్రలో తీవ్రత పెరుగుతున్న కరోనా తెలుగు రాష్ట్రాలతోపాటు దేశాన్ని అల్లాడించేస్తోంది. ప్రస్తుతం ఈ వార్తల నేపథ్యంలో పిల్లల సంరక్షణపై తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. మరి.. మహారాష్ట్రలో నమోదవుతున్న కేసులు థర్డ్ వేవ్ కు చెందినవేనా.. కాదా.. అనేది తేలాల్సి ఉంది.