ఏంటి? దేశమంతా, ప్రాంతాలకు అతీతంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మేలు చేసిందా?
ఏపీలో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయని విపక్షాలు మండిపడుతున్న సమయంలో… జగన్కు కరోనా హెల్ప్ ఎలా చేస్తుంది? అంటూ ఆలోచిస్తున్నారా? అసలు విషయం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు.
ఏపీలో ఇలా…
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న పలు నిర్ణయాలు, రాష్ట్రంలో అనుకోకుండా తెరమీదకు వచ్చిన వివిధ సంఘటనల కారణంగా వివాదాలు తెరమీదకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయం చాలా అలజడికి దారి తీసింది. ఒక్కో రైతు వ్యవసాయానికి ఎంత వాడుతున్నది ఖచ్చితంగా లెక్క గట్టి ఆ సొమ్మును తన ఖాతాకు బదలాయించి నగదుగా జమ చేయాలన్నది ఈ పథకం పరమార్థం. దీంతో పాటుగా, అమరావతి విషయంలోనూ సీఎం జగన్ తన వైఖరిని పునరుద్ఘాటించారు. ప్రతిపక్షాల విమర్శలు, కోర్టుల్లో వివాదాలు, మీడియాలో చర్చలు, అమరావతి నిరసనల తరువాత కూడా ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు ఇంచుకైనా మారలేదని హిందూస్తాన్ టైమ్స్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ స్పష్టం చేస్తోంది.
హిందువుల మనోభావాలు… దళితుల పేరుతో రాజకీయాలు
ఇదే కాకుండా హిందూ దేవాలయాల వద్ద జరిగిన వివిధ ఘటనలు, అంతర్వేదిలో రథం దగ్ధమవడం సహా వివిధ అంశాలు తీవ్ర వివాదాదస్పదంగా మారాయి. ఏపీ ప్రభుత్వాన్ని విపక్షాలు ఉక్కిరిబిక్కిరి చేసే స్థాయికి చేరి ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించే వరకు పరిస్థితి చేరింది. మరోవైపు దళితులపై దాడులు జరుగుతున్నాయనే అంశం సైతం రాజకీయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ను టార్గెట్ చేసేందుకు సహకరించింది. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్పై సెస్సు పెంపుపై కూడా ఆందోళనలు తుస్సుమన్నాయి. అయితే, ఇవన్నీ టీ కప్పులో తుఫానుగా మారిపోయాయి. ఇందుకు కారణం పరిస్థితులు.
కరోనా ఎంట్రీ… భలే టైం గురూ
ఆంధ్రప్రదేశ్లో కరోనా కలకలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. అయితే, ఇలాంటి సమయంలోనే అదే కరోనా కారణంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సేఫ్ అయ్యారని అంటున్నారు. పలు నిర్ణయాలు, వివాదాల సమయంలో సహజంగానే విఫక్షాలు రోడ్డెక్కాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రధాన ప్రతిపక్షం, మీడియా అండ ఉన్న తెలుగుదేశం పార్టీతో సహా వివిధ పార్టీలు కొన్ని చోట్ల నామ్కే వాస్తీ ఆందోళనలు చేశాయి. జూమ్ వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించడం, పత్రికా ప్రకటనలు విడుదల చేయడం వంటి వాటితో సరిపెట్టాయి. కానీ క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలేవీ చేయలేదు. దీనికి కారణం కరోనా భయమే. కార్యకర్తలు, చోటా మోటా నాయకులు సహా ఎవరూ రోడ్డెక్కకపోవడంతో ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోయింది. ఈ రకంగా సీఎం వైఎస్ జగన్కు కరోనా మేలు చేసిందని చర్చించుకుంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?