ఈవిఎంలు అనేక వివాదాలకు మూల బిందువులుగా ఇటీవల కాలంలో మారాయి. వీటిని హ్యాక్ చేయవచ్చునంటూ కొందరు సాంకేతిక నిపుణులు పవర్పాయింట్ డెమాన స్టేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
పరాజయం పొందిన పార్టీలన్నీ ఈవీఎమ్ లను నిందిస్తూ అవి మాకు వద్దే వద్దంటూ జాతీయ స్థాయిలో రచ్చ కూడా చేసిన విషయం తెలిసిందే.వీటి విషయమై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి అలాంటి వారందరికీ ఇప్పుడు ఒక ఊరట కలిగించే వార్త ఇది. కరోనా వైరస్ ప్రభావం ఈవిఎంలపై కూడా ఉంటుందని కాబట్టి వాటి వాడుక సరికాదని ఎన్నికల సంఘం భావిస్తోందట. ఎందుకంటే ఈవీఎంల్లో ఓటు వేయాలంటే పంచ్ (మీట నొక్కాలి )చేయాలి. అలా ఒక్కో బూత్లో .. ఒక్క ఈవీఎంపై కనీసం వెయ్యి మంది ఒకే చోట టచ్ చేస్తారు.
అది కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం అవుతుంది. ఒక్క ఓటర్కు లక్షణాలు లేని కరోనా వైరస్ ఉన్నా.. ఇతరులకు వ్యాపించడం సులభం. అందుకే.. ఇప్పుడు.. బ్యాలెట్పై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముందుగా.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బ్యాలెట్ వాడే అవకాశం కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలకు తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ లేఖ రాశారు. కోవిడ్ కారణంగా బ్యాలెట్ పేపర్, ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు సంబధించి పార్టీల అభిప్రాయం తెలపాలని సూచించారు. ఈనెల 30 లోపు అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని లేఖలో ఎస్ఈసీ కోరింది. ఇది ఈవిఎంలను వ్యతిరేకించే పార్టీలన్నింటికీ అందివచ్చిన పెద్ద అవకాశం.
కాబట్టి అవన్నీ కూడా బ్యాలెట్ వైపే మొగ్గు చూపే అవకాశాలు మెండు.అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై మోజు చూపడం లేదు .మన తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను కూడా బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించటం ఇక్కడ గమనార్హం.ఇలా ఏ లెక్కన చూసినా ఈవీఎంలకు ఎవరు మద్దతిచ్చే సూచనలు గోచరించడం లేదు.ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లంటే మండిపడే తెలుగుదేశం పార్టీకి ఇది వీనుల విందైన వార్త .ఇప్పటికీ ఆ పార్టీ తమకు కేవలం ఇరవై మూడు సీట్లు లభించటం ఈవిఎంల వల్లేనని తప్పుడు భ్రమలో ఉండటం ఇక్కడ విశేషం. కాబట్టి బ్యాలెట్ అంటే టిడిపి ఎగిరి గంతేయ వచ్చునని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఈ విషయంలో ఇతర పార్టీల స్పందన ఏమిటో తెలియాలంటే ఈ నెల ముప్పై వ తేదీ దాకా వేచి చూడాలి !