(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఈ నెల 14వ తేదీ నుండి అక్టోబర్ ఒకటవ తేదీ వరకూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో వారాంతపు సెలవులూ లేకుండా ఉభయ సభలను నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. అదే విధంగా వైరస్ ఉద్ధృతి దృష్యా వివిధ బిల్లులపై సభ్యుల ఓటింగ్ను గతంలో మాదిరిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు.ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ బదులు పేపర్ బ్యలెట్లను సభ్యుల ఓటింగ్కు ఉపయోగించడం వల్ల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చట్టాల రూపకల్పనలో ఇప్పటి కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. బిల్లులపై ఓటింగ్నకు పేపర్ బ్యాలెట్లను ఉపయోగిస్తున్నట్లు పార్లమెంట్ కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు.
గతంలో బిల్లులపై ఓటింగ్నకు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించే వారు. అయితే దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఓటింగ్ యంత్రాలు అందుబాటులోకి తీసుకురావడంత చట్ట సభల్లోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. ఓటింగ్ సమయంలో యంత్రంలో లోపాలు వచ్చినా, సభ్యులు పొరపాటున వ్యతిరేక ఓటు వేసినా, వాళ్లకు బ్యాలెట్ను అందించే వారు. అయితే ఇప్పుడు కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతంలో మాదిరిగానే బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహణకు చర్యలు చేపడుతున్నారు. అయితే ఎలక్ట్రానిక్ యంత్రాలతో సభ్యుల ఓటింగ్ ఫలితం తేలడానికి కేవలం అయిదు నిమిషాలు పట్టే అవకాశం ఉండగా, బ్యాలెట్ ద్వారా సభ్యుల ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేయడానికి దాదాపు 20 నిమిషాలు పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో సభ్యులందరూ సామాజిక దూరం పాటించాలని పార్లమెంట్ కార్యదర్శి ప్రకటనలో కోరారు. దానికి అనుగుణంగానే ఉభయ సభల్లో ప్రత్యేకంగా సీట్లు ఏర్పాటు చేశామనీ, సభ్యులు ఎవరకి కేటాయించిన స్థానాల్లో వారే కూర్చోవాల్సి ఉంటుందనీ పేర్కొన్నారు.
ఈ వర్షాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ సంస్కరణలకు సంబంధించిన అర్డినెన్స్లతో పాటు మొత్తం 11 ఆర్డినెన్స్లను కేంద్రం ఆమోదముద్ర వేయనున్నది. వీటితో పాటు పెండింగ్లో ఉన్న మరి కొన్ని బిల్లులకు కూడా ఆమోదం తెలుపనున్నది.