కరోనాతో మృతి చెందితే ఎక్కడ పూడ్చాలో తెలుయడం లేదు. అంత్యక్రియలు ముగిస్తే అంటుకుంటుంది అనే భయం. అక్కడకు వెళ్లిన వారిని తిరిగి ఊళ్ళల్లోకి కూడా రానీయడం లేదు. రాష్ట్రంలోని పల్లెల్లో అత్యంత దారుణ పరిస్థితులు ఉన్నాయి. తాజాగా ఈరోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అమానుషం చోటుచేసుకుంది.
కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తికి పారిశుధ్య కార్మికులు అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో అంత్యక్రియలు నిర్వహించిన పారిశుధ్య కార్మికులను స్థానికులు కాలనీలోకి రాకుండా అడ్డుకున్నారు. గ్రామస్థులు అందరూ ఎవరూ రాకుండా ముళ్ళ కంచెలు వేశారు. ఈ ఘటనపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకున్న 10 మందిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
ఇక రెండు రోజుల కిందట ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన, కడప జిల్లా పొద్దుటూరు సమీపంలోనూ కరోనా మృతులకు అంత్యక్రియలు జరగకుండా గ్రామాల వాళ్ళు అడ్డుకున్నారు. ఇలా పల్లెల్లో కరోనా భయం విపరీతంగా వ్యాపిస్తుంది. రాష్ట్రంలో మొదట్లో పెద్దగా కరోనా మరణాలు లేవు. అందుకే ఈ ఘటనలు బయటకు రాలేదు. కానీ గడిచిన పది రోజుల్లో మరణాల సంఖ్య పెరిగింది. ఆ వ్యవధిలో 110 మంది మరణించారు. అందుకే ఈ పల్లెల్లో అపోహలు, భయాలు బయటకు వస్తున్నాయి..