తెలంగాణలో మళ్లీ కరోనా అలజడి చెలరేగింది.అసలే కరోనా స్టెయిన్ వార్తలతో ప్రజలు ఆందోళన చెందుతున్న వేళ సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆ పట్టణంలోనిఓ ఇంట్లో ఏకంగా 22 మందికి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో జిల్లా ప్రజలు ఉలిక్కి పడుతున్నారు.
గతంలో మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా ఇదే పట్టణంలో వందల మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో అప్పుడు జిల్లా రెడ్ జోన్ లోకి వెళ్లింది. మళ్లీ ఇప్పుడు అదే తరహాలో కరోనా విజృంభిస్తుండడంతో పట్టణవాసులు కలవరానికి గురవుతున్నారు.
ఆ కార్యక్రమమే కరోనా వ్యాప్తికి మూలమా?
సూర్యాపేట పట్టణంలో యాదాద్రి టౌన్ షిప్ లోని ఓ ఇంట్లో ఇటీవల ఒకరు మృతిచెందారు. ఆయన అంత్యక్రియలకు వందలాది మంది బంధువులు హాజరయ్యారు. అయితే మృతిచెందిన వ్యక్తి కుమారుడికి తండ్రి అంత్యక్రియల అనంతరం కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు కొవిడ్ పరీక్షలు చేయించడంతో 22 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది.అంతేగాక అంత్యక్రియలకు హాజరైన వారి వివరాలు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సేకరిస్తున్నారు.అంత్యక్రియలకు హాజరైన వారు జిల్లా లోని పలు ప్రాంతాల్లో ఉండటంతో వారందరినీ కూడా గుర్తించి కరోనా పరీక్షలు చేయించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
సూర్యాపేట డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ సిబ్బంది యాదాద్రి టౌన్ షిప్ లో సర్వే చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి కరోనా టెస్టులు చేసేందుకు వైద్యశాఖ సిద్ధమవుతోంది.పట్టణంలో ఈ వార్త దావాలనంలా వ్యాపించింది.విషయం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరడంతో అక్కడి నుండి కూడా తక్షణ చర్యలకు ఆదేశాలు వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అవసరమైతే సూర్యాపేట పట్టణంలో మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని కూడా ఆ వర్గాలు తెలిపాయి.సమాచారం అందుకున్న స్థానిక శాసనసభ్యుడు జగదీశ్వర్రెడ్డి కూడా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏమాత్రం ఉపేక్షించకుండా కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.