రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఒక సారి కరోనా సోకి తగ్గిపోయిన వారికి మరో సారి సోకడం ఆందోళన కల్గిస్తోంది. కరోనా ప్రారంభ దశలో ప్రజలు మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం జాగ్రత్తలు పాటించారు. రానురాను కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మెజారిటీ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, నేతలు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దీంతో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీనితో పలువురు ప్రజా ప్రతినిధులు కూడా మాస్కులు ధరించడం లేదు. ఒక వేళ మాస్కులు ధరిస్తున్నప్పటికీ భౌతిక దూరం ఎక్కడా పాటించడం లేదు. ఒక సారి కరోనా బారిన పడి తగ్గిపోయిన తరువాత ఆ వ్యక్తులకు మరో సారి వైరస్ అంటుకోదని చాలా మంది అనుకుంటున్నారు. దీంతో కరోనా బారిన పడి తగ్గిపోయిన వారు తమకు ఏమీ కాదన్నట్లుగా ధైర్యంగా ఉంటున్నారు. అయితే ఇదే కొంప ముంచుతున్నది. అక్కడక్కడా రెండవ సారి కరోనా బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురి అవుతున్న వారు కనబడుతున్నారు.
గత నెలలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి రెండవ సారి కరోనా బారిన పడి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. రెండు రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు రెండవ సారి కరోనా బారిన పడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్సులో హైదరాబాద్కు తరలించారు. రెండవ విడత కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రజలు, నాయకులు భయపడుతున్నారు. నేడు తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు రెండవ సారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కరోనా పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. జూలై లో తనకు కరోనా వచ్చి తగ్గగా ఇప్పుడు మరల రీ ఇన్ఫెక్షన్ కి గురి కావడం ఆశ్చర్యన్ని కల్గించిందన్నారు. అవసరం అయితే ఆసుపత్రిలో చేరతానని తెలిపారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా అంబటి పాల్గొన్నారు. ఆ సందర్బంలో పలువురు సహచర ఎమ్మెల్యే లు, మంత్రులను అంబటి కలిశారు. ఇప్పుడు అంబటి మరోసారి కరోనా బారిన పడ్డారని తెలియడంతో ఆయనను కలిసిన వారిలో ఆందోళన మొదలయింది. వారు పరీక్షలు చేయించుకోవాలని భావిస్తున్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంతకు ముందు మాదిరిగా స్పందించి చర్యలు తీసుకోవడం లేదు. దీనితో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది. ఫలితంగా కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి.