ఏపీలో కరోనా ఎంతమందికి సోకింది..? – అధికారిక లెక్కల ప్రకారం అయిదున్నర లక్షల మందికి మాత్రమే..!! కానీ కరోనాపై ఓ సర్వే ప్రకారం రాష్ట్రంలో కోటి మందికి పైగా కరోనా బారిన పడ్డారని తేలింది. జిల్లాల వారీగా, సూక్ష్మమైన అధ్యయనాన్ని ఆ సర్వే ద్వారా వెల్లడయింది.
సిరో లాజికల్ సర్వే (ICMR పరిధిలోని) ప్రకారం ఏపీలో కరోనాపై కొన్ని సంచలన వాస్తవాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 5 . 34 కోట్ల జనాభాలో 20 శాతం అంటే కోటి మందికి పైగా కరోనా బారిన పడ్డట్టు తేలింది. అయితే ఇవన్నీ అసీంప్టమెటిక్ (ఎటువంటి లక్షణాలు లేకుండా) ద్వారా వచ్చి పోయింది. ఈ సర్వే గత నెలలో రెండు దశల్లో జరిగింది.
* రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఒక్కో జిల్లాలో 5 వేల నమూనాలు సేకరించారు. వారిలో 19 . 7 శాతం మందికి కరోనా వచ్చి పోయిన తర్వాత శరీరంలో జరిగే మార్పులు (యాంటీ బాడీస్ పెరగడం వంటివి) కనిపించాయట.
* ఈ సర్వే వివరాలను ఏపీ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో 22 . 5 శాతం మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 18 . 2 శాతం మందికి కరోనా వలన వచ్చే వ్యాధి నిరోధకశక్తి పెరిగినట్టు గుర్తించామన్నారు.
* ఈ సర్వేలో తేలిన 20 శాతం మందిలో దాదాపు 90 నుండి 100 శాతం మంది లక్షణాలు ఏమి లేకుండానే తగ్గినట్టు గుర్తించారు.
* చిత్తూరు జిల్లా 100 , అనంతపురం 99.5, కృష్ణా 99.4, గుంటూరు 98.5, శ్రీకాకుళం 98.5, కర్నూలు 98.3, ప్రకాశం 90.9.., శాతం లక్షణాలు ఏమి లేకుండా బయటపడినట్టు వెల్లడయింది. రాష్ట్రంలోని ప్రకారం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో అధ్యయనం సందర్భంగా ఎక్కువగా కేసులు పెరుగుతున్నట్టు గుర్తించారు.
ముందున్నవి మంచి రోజులేనా..?
సిరో సర్వే.., ఏపీలో రిపోర్ట్స్ ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు 22 శాతం మందికి కరోనా యాంటీ బాడీస్ వృద్ధి చెందాయి. ప్రస్తుతం చూసుకుంటే రోజుకి సగటున 10 వేల కేసులు అధికారికంగా నమోదవుతున్నాయి. అనధికారికంగా, లక్షణాలు లేకుండా సగటున రోజుకి 20 వేల వరకు ఉండవచ్చు. అంటే అక్టోబర్ చివరి నాటికీ రాష్ట్రంలో దాదాపు 35 నుండి 40 శాతం మందికి కరోనా వచ్చి తెలియకుండానే పోయే వీలుంటుంది. వారిలో యాంటీ బాడీస్ వృద్ధి చెందుతాయి. ఇది ఒకరకంగా శుభ పరిణామం అనేది అధికారిక వర్గాల అంచనా. యాంటీ బాడీస్ వృద్ధిలో పశ్చిమ గోదావరి ఇంకా వెనుకబడి ఉంది. అంటే ముందున్నవి మంచి రోజులేనని నవంబరు నాటికి కరోనా ప్రభావం, ప్రాబల్యం పెద్దగా ఉండదు అనేది అధికారిక వర్గాల అంచనా.