కరోనా ఉదృతి నేపథ్యంలో శాసనసభ శీతాకాల సమావేశాలను అయిదు రోజులకు కుదించి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో సమావేశాల నిర్వహణకు అసెంబ్లీ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా కలకలాన్ని రేపుతోంది. రెండు రోజులుగా సమావేశాలకు హజరైన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యుడు కారుమూరి నాగేశ్వరరావుకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందని ప్రచారం జరుగుతుండటం సభ్యులను ఆందోళన కల్గిస్తోంది.
ఎమ్మెల్యే కారుమూరి మంగళవారం శాసనసభలో ప్రసంగించారు. కారుమూరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వడం వల్లనే నేడు ఆయన అసెంబ్లీకి హజరుకాలేదని అంటున్నారు. అయితే ఈ విషయం తెలియడంతో రెండు రోజులుగా కారుమూరితో సన్నిహితంగా మెలిగిన ఏమ్మెల్యేల గుండెల్లో గుబులు మొదలైందట. నేడు అసెంబ్లీలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఒక్క సారిగా కరోనా భయం మొదలు కావడంతో కొందరు ఎమ్మెల్యేలు నేడు అసెంబ్లీకి గైర్హజరు అయ్యారుట. అయితే ఈ విషయాన్ని అసెంబ్లీ వర్గాలు దృవీకరించలేదు. కారుమూరికి కరోనా సోకిందనేది పుకారేనని ఆయన సన్నిహితులు అంటున్నారు. కారుమూరికి కరోనా పాజిటివ్ అన్న వార్తలను ఆయన కార్యాలయం దృవీకరించలేదు.