ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్న సామెత మాదిరిగా కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ప్రకటనలు అలా వస్తున్నాయి. వివిధ కంపెనీలు ఉత్పత్తి చేసిన కరోనా వ్యాక్సిన్ పంపిణీకి భారత ప్రభుత్వం ఇంత వరకూ అనుమతులు మంజూరు చేయలేదు. దీనికి తోడు వ్యాక్సిన్ పంపిణీ ఉచితమా లేక ప్రజలు ఎంత చెల్లించాలి అనేది ఇంకా స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జనవరి, ఫిబ్రవరి నెలలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పై కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంలో ఈ విషయంపై అఫిడవిట్ సమర్పించింది. అంటే రాష్ట్రంలో జనవరి రెండవ లేదా చివరి వారం నుండి ఫిబ్రవరిలో వాక్సినేషన్ ప్రక్రియ ఉండే అవకాశం ఉంది.
ప్రభుత్వ ప్రకటన ఇలా ఉంటే అధికార పార్టీ ఎంపి విజయసాయి రెడ్డి మాత్రం ఈ నెల 25వ తేదీ నుండే రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ అంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా వ్యాక్సినేషన్ పై ప్రభుత్వ అదికారిక ప్రకటన వెలువడకపోయినా విజయసాయి రెడ్డి అధికార పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉండటం వల్ల ఆయనకు కశ్చిత సమాచారం ఉండి ఉంటుందని భావించాలి.
“డిసెంబర్ 25 నుండి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చే బృహత్ కార్యక్రమం ప్రారంభం కానుంది. సీఎం వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు 4762 ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది. కోటికిపైగా టెస్టులు నిర్వహించి వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్రం విజయం సాధించింది” అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఇంత వరకూ దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
తెలంగాణలో జనవరి మూడవ తేదీ నుండి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నది వార్తలు వచ్చిన నేపథ్యంలో విజయసాయి రెడ్డి ప్రకటనతో ఏపి ముందంజలో ఉంది అనడానికి ఆస్కారం ఏర్పడింది. జనవరి 15 నుండి మార్చి 15 మధ్య కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ లోపుగానే కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం శుభపరిణామమే.
గందరగోళానికి తెరలేపిన విజయసాయిరెడ్డి
కరోనా వ్యాక్సినేషన్కు సంబంధించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గందరగోళానికి తెరలేపారు. ఈ నెల 25 నుండి కరోనా వ్యాక్సిన్ పంపిణీ అంటూ ట్వీట్ చేయడంతో రాష్ట్ర ప్రజలు సంబరపడ్డారు. ఇంకా పది రోజులు ఓపికపడితే చాలు వ్యాక్సిన్ వచ్చేస్తుందని అని భావించారు. అయితే ఆ ఆశలకు నీళ్లు చల్లే విధంగా విజయసాయిరెడ్డి తాను పోస్టు చేసిన కరోనా వ్యాక్సినేషన్కు సంబంధించిన ట్వీట్ను కొద్దిసేపటికే తొలగించడం గమనార్హం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి స్పష్టత లేకపోవడంతో ఈ ట్వీట్ ను తొలగించి ఉంటారని భావిస్తున్నారు.