ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వాక్సిన్ రానేవచ్చింది. బ్రిటన్ లో కనుగొన్న ఈ వాక్సిన్ ను ఫైజర్ సంస్థ అతి త్వరలోనే ప్రపంచమంతట సరఫరా చేయనుంది. భారతదేశానికి కరోనా టీకా అందించేందుకు ఫైజర్ సంస్థ సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. టీకా పరీక్షలు దాదాపు చివరి దశకు చేరుకున్నందున త్వరలోనే కరోనా టీకా అందుబాటులోకి రానున్నది అని ఎయిమ్స్ డైరెక్టర్ అంటున్నారు.
జర్మనీకి చెందిన బయాన్టెక్ సంస్థతో కలిసి ఫైజర్ సంస్థ కొవిడ్ టీకాను కనుగొన్నది. ఈ టీకా వినియోగానికి యూకేలో తాత్కాలిక అనుమతి లభించడంతో వచ్చే వారం నుంచే అక్కడి ప్రజలకు ఈ టీకా అందుబాటులో ఉండనున్నది. ఈ వాక్సిన్ ను కోల్డ్ చైన్ పద్దతిలో ప్రపంచమంతా పంపిణీ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఫైజర్ ప్రపంచవ్యాప్తంగా టీకాను సరఫరాచేయడానికి ఇప్పటికే పలు దేశాలతో చర్చలు జరిపింది. ఈ విషయం గురించి ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో భారత ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తామని, ఆ దేశానికి కూడా టీకాను పంపిణి చెయ్యాలనుకుంటున్నామని ఫైజర్ చైర్మన్ అల్బర్టా బౌర్లా స్పష్టం చేశారు.