Corona Vaccine : భారతదేశంలో రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొదటి ఫేజ్ లో ఎన్నో లక్షల మందికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా టీకాలు వేశారు. ఫ్రంట్ లైన్ లో చాలా శాతం మంది దీని ద్వారా వ్యాక్సిన్ అందించబడింది అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇక రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ మార్చి 1 నుండి ప్రారంభం కానుంది.
దీని కోసం దేశవ్యాప్తంగా 20 వేల ప్రైవేట్ ఆస్పత్రులను కేంద్రం ఎంపిక చేసింది. వాటన్నింటిలో ఫీజు చెల్లించి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికే ఉన్న పదివేల ప్రభుత్వాసుపత్రులకి ఇవి అదనం కాబట్టి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా ఉచితంగా కూడా లభిస్తుంది. అయితే ప్రైవేటు కేంద్రాల్లో చేయించుకునే వారు మాత్రం డబ్బు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం టీకాని ఉచితంగా పంపిణీ చేస్తారని చెప్పారు.
ప్రైవేటు కేంద్రంలో కూడా తక్కువ మొత్తంలో నామినల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇంతకీ ఆ ఫీజు ఎంత అనేది రెండు మూడు రోజుల్లో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు మంత్రి గారు. మొత్తానికి ప్రైవేట్ ఆస్పత్రిలో వినియోగించే సిరంజిల ఖర్చు, ఇతర వనరుల ఖర్చు, రవాణా ఖర్చు మొత్తం కలిపి సామాన్యుడు భరించదగ్గ మొత్తంలోనే నిర్ణయిస్తారని వైద్యులు చెబుతున్నారు.
మొదటి విడత వ్యాక్సినేషన్ లో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్లు వేశారు. ఇప్పుడు మలి విడతలో భాగంగా 60 ఏళ్లకు పైబడిన వారికి…. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి… 45 ఏళ్లు పైబడిన వారికి టీకా అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశ వ్యాప్తంగా మొదటి దశ వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంది. ఈరోజు ఉదయం వరకు 12 కోట్ల 16 లక్షల 55 వేల 98 మందికి వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అలాగే వ్యాక్సిన్ పంపిణీలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది.