ఆహారాలు లేదా ప్యాక్ చేయబడిన ఆహారాల ద్వారా కరోనా వైరస్ వ్యాపించదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) స్పష్టం చేసింది. బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకోబడ్డ ప్యాక్డ్ చికెన్ వింగ్స్, రొయ్యలలో కరోనా వైరస్ ఉన్నట్లు చైనాలో గుర్తించారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టతనిచ్చింది. ఆహారాలు లేదా ప్యాక్ చేయబడిన ఆహారాల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందన్న వార్తల్లో నిజం లేదని ఆ సంస్థ తెలిపింది. అందువల్ల ప్రజలు ఈ విషయంపై భయాందోళనలకు గురి చెందాల్సిన పనిలేదని WHO పేర్కొంది.
ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ ప్రోగ్రామ్ హెడ్ మైక్ ర్యాన్ మాట్లాడుతూ.. ఆహారాలు లేదా ప్రాసెస్ చేయబడిన, ప్యాక్ చేయబడ్డ ఆహారాల ద్వారా కరోనా వైరస్ వ్యాపించదు. కేవలం 10 శాతం లేదా అంతకన్నా తక్కువ కేసుల్లోనే ఇలా జరుగుతుందని అన్నారు. కనుక ఈ విషయంలో భయపడాల్సిన పనిలేదన్నారు.
మరోవైపు బ్రెజిల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇదే విషయంపై స్పందిస్తూ.. తాము ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఆహారాలను అత్యంత శుభ్రంగా ప్రాసెస్ చేసి, ప్యాక్ చేసి పంపిస్తామని, అందువల్ల అవి సురక్షితమేనని, అయితే తమ దేశం దాటాక వాటిలో కరోనా ప్రవేశించి ఉంటుందని తెలిపింది. కాగా ఆహార పదార్థాల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేనప్పటికీ జనాలు మాత్రం ఈ విషయంపై ఆందోళన చెందుతున్నారు. దీనిపై సైంటిస్టులు మరిన్ని పరిశోధనలు చేసి వివరాలను తెలియజేస్తారేమో చూడాలి.