తెలంగాణ రాష్ట్రం కరోనా వైరస్ పరీక్షల విషయంలో అశ్రద్ధ చేస్తోందని ముందు నుండి కేంద్రం మరియు హైకోర్టు ఎప్పటికప్పుడు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాయి. కానీ మరోపక్క తెలంగాణ సర్కార్ మాత్రం ICMR సూచనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తన వివరణ చెప్పుకుంటూ వస్తోంది. ఇప్పటికే పలుసార్లు ఈ విషయంలో హైకోర్టు చెప్పినా గాని తెలంగాణ సర్కార్ ఐసీఎంఆర్ అంటూ కాకమ్మ కథలు చెప్పడం తో ఈ సారి తీవ్రస్థాయిలో హైకోర్టు… తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినట్లు వ్యాఖ్యలు చేసింది. పూర్తి విషయంలోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెరగాలని ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వార్డుల వారీగా కరోనా పరీక్షలు నిర్వహించి ఫలితాలు తెలియజేయాలి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
అంతేకాకుండా కరోనా పరీక్షలు చేసి వాటి ఫలితాలు కాలనీ సంఘాల వారికి తెలియజేయాలని సూచించింది. రాష్ట్రంలో 54 ఆసుపత్రిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి అన్న వివరాలు రాష్ట్ర ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని కోరింది. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేయాలన్న ఐసిఎమ్ ఆర్ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. గాంధీ హాస్పిటల్ సిబ్బందితో పాటు పోలీసులకు కూడా పిపిఈ కిట్లు సరఫరా చేయాలని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణలో 79 మంది వైద్యులకు కరోనా వైరస్ సోకిందని పబ్లిక్ హెల్త్ విభాగం హైకోర్టుకు తెలియచేసింది. ప్రైవేటు ఆస్పత్రులలోను షిప్టుల వారీగా సిబ్బంది పని చేయాలని తెలంగాణ ప్రభుత్వాని హైకోర్టు ఆదేశించింది.