కరోనా వైరస్ ఇప్పటి వరకు రకరకాలుగా వ్యాప్తి చెందుతుందని సైంటిస్టులు చెబుతూ వచ్చారు. ముక్కు, నోరు, చెవుల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని తెలిపారు. అయితే కళ్లద్దాల వల్ల కూడా కరోనా వస్తుందని తాజాగా వారు తేల్చి చెప్పారు. కళ్లద్దాలు రక్షణగా ఉన్నాయని చెప్పి కరోనా రాదని అనుకోకూడదని, ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. కళ్లద్దాల వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.
సాధారణంగా తలనొప్పికి, దృష్టి లోపాలకు చాలా మంది కళ్లద్దాలను వాడుతుంటారు. అయితే కొందరు కరోనా నేపథ్యంలో కళ్లకు రక్షణగా ఉంటుందని అద్దాలను ఉపయోగిస్తున్నారు. కానీ సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల ప్రకారం కంటి అద్దాలపై కరోనా వైరస్ సుమారుగా 9 రోజుల పాటు జీవించి ఉంటుందని తేలింది. కనుక కంటి అద్దాలను ధరించే విషయంలో జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. వాటిని కూడా శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా హాస్పిటళ్లు, మెడికల్ షాపులు తదితర ప్రదేశాలకు వెళ్లి వచ్చాక కంటి అద్దాలను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. అయితే అద్దాలను శుభ్రం చేసేందుకు పొడి వస్త్రాలు లేదా పాత్రలను తోమేందుకు ఉపయోగించే సబ్బు నురగను వాడవచ్చని, అమ్మోనియా, బ్లీచింగ్ పౌడర్, ఆల్కహాల్ ద్రావణాలను, ఇతర శానిటైజర్లను వాడొద్దని అంటున్నారు. ఇక ప్రయాణాల్లో ఉన్నప్పుడు అద్దాలను శుభ్రం చేసేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ను వాడాలని తెలిపారు. అయితే కంటి అద్దాలను ధరించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, శుభ్రం చేయకపోతే కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు హెచ్చరించారు.