రాజధాని ఢిల్లీల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యతో ఢిల్లీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా పదివేల పడకల ఆసుపత్రిని ఆఘమేఘాల మీద నిర్మించింది ప్రభుత్వం. అయినా రోజురోజుకీ పెరిగిపోతున్న కేసుల సంఖ్యతో ఈ బెడ్లు కూడా సరిపోవడం లేదు. ఢిల్లీలో ప్రస్తుతం కేసుల సంఖ్య 80వేలకు చేరుకుంది. మరణాలు కూడా 3వేలకు చేరువలో ఉన్నాయి.
సామాన్యుల నుంచి రాజకీయ నేతలకు కూడా కరోనా సోకడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. లాక్ డౌన్ సమయంలో అదుపులో ఉన్న ఈ మహమ్మారి ఆంక్షలు ఎత్తివేశాక అదుపుతప్పింది. ప్రధానంగా మర్కజ్ ప్రార్ధనలు దేశంలో వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమైంది. దేశవ్యాప్తంగా వైరస్ ప్రభావం పెరగడానికి ఇదొక కారణంగా భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఢిల్లీలో వేగంగా కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. కేంద్రం కూడా ఢిల్లీపై పూర్తి దృష్టి సారించింది. అమిత్ షా అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో ప్రతి ఇంటా కరోనా పరిక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఢిల్లీలో టెస్టుల సంఖ్య పెంచడంతోనే కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పరిస్థితి అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఢిల్లీలో పరిస్థితి అదుపుతప్పిందని ఆరోపిస్తున్నారు. ప్రజలు ఆందోళనకు గురికాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు అమలు చేస్తోంది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తోంది.