కరోనా వైరస్ మహమ్మారి జన్యుమార్పిడితో కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా, వైరస్లో కొత్త మార్పులు చోటు చేసుకొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మార్పుల కారణంగా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తే ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు పనిచేయకపోవచ్చు అన్నే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డెన్మార్క్లో మింక్ అనే జీవి నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు ఆ దేశానికి చెందిన ది స్టేటెన్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే, ఒక్క డెన్మార్క్లోనే కాకుండా మరో ఐదు దేశాల్లో కూడా మింక్ ఫాంలలో ఈ వైరస్ ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
డెన్మార్క్, అమెరికాతో పాటు ఇటలీ, నెదర్లాండ్స్, స్పెయిన్, స్వీడన్లలోనూ మింక్ ఫాంలలో కరోనా వైరస్ బయటపడినట్టు డబ్ల్యూహెచ్వో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వైరస్ సోకిన వారి చికిత్సలో వస్తున్న ప్రాథమిక ఫలితాలను అంచనా వేస్తూ తదుపరి పరిశోధనలకు డబ్ల్యూహెచ్వో పిలుపునిచ్చింది. డెన్మార్క్లో మింక్ల నుంచి కరోనా వ్యాప్తి చెందుతోందంటూ స్టేటెన్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ చేసిన హెచ్చరికలతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో డెన్మార్క్ ప్రభుత్వం ఉత్తర జూట్ల్యాండ్లో కొత్తగా ఆంక్షలను విధించింది. ఈ ప్రాంతంలో వందల కొద్దీ ఫారమ్ల్లో పెంచుతున్న మింక్లను వధించాలని ఆదేశించింది. ఉత్తర డెన్మార్క్లో కోవిడ్-19 ఆంక్షలు నవంబరు 7 నుంచి అమల్లోకి వచ్చాయి అన్ని ప్రధాని మెట్టీ ఫ్రెడ్రెక్సన్ ప్రకటించారు. జన్యుమార్పడి ద్వారా మింక్ నుంచి వ్యాపించే వైరస్తో ప్రపంచం తీవ్ర ముప్పును ఎదుర్కోనుందని అన్నారు. కొత్తగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్లకు ఈ రకం వైరస్ ముప్పుగా పరిణమించవచ్చని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ ప్రాంత ప్రజలు ప్రయాణాలను రద్దుచేసుకోవాలని ప్రధాని సూచించారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే వ్యాధి వ్యాపించే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఉత్తర జూట్ల్యాండ్ ప్రజలు వైరస్ వ్యాపించకుండా శతవిధాల కృషిచేయాలని, ప్రపంచం మనల్ని గమనిస్తోంది’ అని ప్రధాని ఫెడ్రెక్సన్ పిలుపునిచ్చారు.
మొదట్లో దీనిని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ ప్రాంతంలోని దాదాపు 1,100 ఫారమ్స్లో సుమారు 1.7కోట్ల మింక్లకు వైరస్ ముప్పు ఏర్పడింది. తాజాగా ఐదు మింక్ కేంద్రాల్లోని 12 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. అయితే, రూపం మార్చుకున్న కరోనా వైరస్ జూన్ నుంచి ఇప్పటివరకు 214 మందికి వైరస్ సోకినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అన్నే ఆరోపణలు వస్తున్నాయి.
అయితే వైరస్ మ్యుటేషన్ చెందడం సాధారణమేనని, అంత ప్రమాదకరమేమీ కాదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మనుషుల్లో ఇది అంత తీవ్రమైన అనారోగ్యానికి కారణం కాదని చెబుతున్నారు. ఇప్పటికే డెన్మార్క్లో మొత్తం 52,265 మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో 733 మంది ప్రాణాలను కోల్పోయారు.