కరోనా వైరస్ ఇప్పటి వరకు ఆ వ్యాధి సోకిన వారిని తాకడం వల్ల లేదా.. వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెదజల్లబడే తుంపర్లను పీల్చడం ద్వారా.. మాత్రమే వస్తుందని అనుకున్నారు. అయితే ఇప్పుడు కరోనా రోగులు ఉన్న ప్రదేశంలో ఉండే గాలి ద్వారా కూడా ఆ వ్యాధి వస్తుందని సైంటిస్టులు అంటున్నారు. ఈ మేరకు కొందరు పరిశోధకులు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు లేఖ రాశారు. అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ కూడా ఇదే విషయంపై తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది.
గాలిలో చిన్న చిన్న కణాలు ఉంటాయని.. వీటి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని ఆ పరిశోధకులు అంటున్నారు. అందుకు అనుగుణంగానే కరోనా ఎలా వ్యాపిస్తుందనే విషయాల్లో ఈ అంశాన్ని కూడా చేర్చాలని సైంటిస్టులు ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరుతున్నారు. ఇక ఇవే విషయాలను వచ్చే వారంలో ఓ జర్నల్లోనూ ప్రచురిస్తామని 32 దేశాలకు చెందిన 239 మంది సైంటిస్టులు చెబుతున్నారు.
కరోనా రోగులు తుమ్మినా లేదా దగ్గినా వెలువడే తుంపర్లు గాలిలోని చిన్న కణాల్లోకి ప్రవేశిస్తాయి. తరువాత ఒక గది విస్తీర్ణాన్ని పోలిన నిర్దిష్టమైన ప్రదేశంలోనే ఆ కణాల్లో వైరస్ తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆ ప్రదేశంలోకి ఎవరైనా వెళ్లి అక్కడి గాలిని పీల్చుకుంటే వెంటనే వైరస్ ఆ వ్యక్తికి వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు కేవలం తుంపర్లను పీల్చడం, తాకడం ద్వారానే కరోనా వస్తుందని అనుకున్నారు.. కానీ గాలిలో ఉండే అలాంటి కరోనా వైరస్ కణాలను పీల్చడం ద్వారా కూడా కరోనా వస్తుందని, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నందుకు కారణం ఇదే అయి ఉంటుందని కూడా.. సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.