(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లు కరోనా వైరస్ వ్యాప్తి ఊహాగానాలే ప్రజలను ఎక్కువగా భయాందోళనకు గురి చేస్తున్నాయి. చైనాలో ఉద్భవించిన కరోనా మహామ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 60 దేశాలకు పాకిన ఈ వైరస్ వల్ల 3,100 మంది మృతి చెందగా మరో 90 వేల మంది చికిత్సలు పొందుతున్నారు. ఇతర దేశాలకు వెళ్లి స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వారు సాధారణ జలుబుతో తుమ్మినా కరోనా వైరస్ సోకిందేమో అన్న భయాందోళనలు సామాన్య ప్రజానీకంలో నెలకొన్నాయి.
భారతదేశంలో ఇప్పటి వరకూ అధికారికంగా ఐదు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేరళలో మూడు, ఢిల్లీలో ఒకటి, హైదరాబాద్లో ఒక కేసు బయటపడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు రోజుల క్రితమే హైదరాబాద్లో దుబాయి నుండి వచ్చిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్కు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అతనికి గాంధీ ఆసుపత్రిలోని ఇసోలేషన్ వార్డుల ఉంచి వైద్యులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. మరో ఎనిమిది మంది కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చేరారు. వీరంతా ఇటలీ, ఇండోనేషియా, ఇజ్రాయిల్, జపాన్ దేశాలకు వెళ్లివచ్చిన వారిగా తెలుస్తోంది. కరోనా వైరస్ బారిన పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగికి తొలుత చికిత్స అందించిన సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రి సిబ్బంది కూడా గాంధీ ఆసుపత్రికి వెళ్లి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.
తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. ఇటీవల కొరియా వెళ్లి వచ్చిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కరోనా సోకిందని అనుమానిస్తున్నారు. కొత్తపేట మండలం వాడపాలేంకు చెందిన ఈ వ్యక్తి హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ సంస్థలో విధులు నిర్వహిస్తూ ఇటీవలే దక్షిణ కొరియా వెళ్లి హైదరాబాద్ తిరిగి వచ్చారు. అనంతరం స్వగ్రామానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్లోని అధికారులు సదరు ఉద్యోగి వివరాలు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డికి అందజేశారు. ఈ సమాచారంతో జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమై అనుమానిత వ్యక్తిని గుర్తించి కాకినాడ జిజిహెచ్కు తరలించగా కరోనా ఇసోలేషన్ వార్డులో ఉంచారు. సదరు వ్యక్తి దక్షిణ కొరియా నుండి భారత్కు వచ్చినప్పుడు ఢిల్లీ ఎయిర్ పోర్టుల చేసిన స్ర్కీనింగ్ టెస్ట్లో నెగిటివ్ రావడంతో స్వగ్రామానికి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. అయితే గత రెండు రోజులుగా ఆ వ్యక్తి జలుబుతో బాధపడుతుండటంతో రక్త నమూనాలను సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి పంపించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందనీ, రక్త నమూనా ఫలితాలు వచ్చిన తర్వాతా కరోనా వైరస్ ఉందా లేదా అన్నది నిర్ధారణ అవుతుందనీ జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి మీడియాకు తెలిపారు.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసు వెలుగులోకి రావడంతో రెఁడు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వైరస్ నిరోధించడంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందామని తెలియజేశారు. ప్రజలను ఆందోళనకు గురి చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా జిల్లా ఆసుపత్రుల్లో ఇసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు.