ఇప్పుడు ప్రజలందరి చూపు కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందా? అనే దానిపైనే పడిందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మనదేశంలో కేవలం ఏడు రాష్ట్రాల్లోనే దాదాపు డెబ్బై శాతం పాజిటివ్ కేసులు వుంటున్నాయంటూ ప్రధాని మోడీ వాటి ముఖ్యమంత్రుతో సమావేశం జరిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా తాకిడి ఎక్కువగా వుందని గుర్తించి ఆ రాష్ట్రాల సీఎంలతో సమావేశం జరిపారు. అయితే, ఇందులో పరిష్కారాలపై కొత్తగా వ్యూహం రూపొందించినదేమీ లేదు. దీంతో ఇప్పుడు ప్రజల్లో కొత్త సందేహాలు మొదలువుతున్నాయి.
దేశంలో ఏం జరుగుతోంది?
భారతదేశంలో కరోనా కలకలం `ఇంకా` కొనసాగుతూనే ఉంది. ఈ మహహ్మారి వల్ల మృతుల సంఖ్య 90వేలు దాటిపోగా రోజుకు 90 వేల మంది కొత్తగా వైరస్కు గురవుతున్నారు. మరణాలకు సంబంధించి అమెరికా, బ్రెజిల్ తర్వాత భారతదేశమే మూడో స్థానంలో వుంది. రోజు వారి పాజిటివ్ కేసుల్లో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో వుంది. పరిస్థితి చూస్తుంటే, మరణాల విషయంలో మనం అమెరికాను దాటిపోయే రోజు కూడా ఎంతో దూరంలో లేదంటున్నారు. మరోవైపు పార్లమెంటు సమావేశాల్లో ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ లాక్డౌన్ ద్వారా మరో 30 లక్షల మందిని కరోనా బారిన పడకుండా కాపాడామని మరణాలు కూడా మరో 30-40వేలు పెరగకుండా నిరోధించామని ప్రకటించారు. దేశంలో మరణాల రేటు కన్నా కోలుకున్న వారి సంఖ్య లేదా రికవరీ రేటు ప్రపంచంలోనే ఎక్కువగా వుందని చెబుతున్నారు. అయితే, ఇవి వాస్తవ విరుద్దంగా వున్నాయని ఆరోగ్యరంగ నిపుణలు హెచ్చరిస్తున్నారు.
మన లెక్కలు తప్పా?
దేశంలో కరోనా వ్యాధిగ్రస్తులు మరణాల సంఖ్య 1.67 శాతం మాత్రమేనని కేంద్రం ప్రకటించింది. అయితే, ఇది అశాస్త్రీయమనదని అంటున్నారు. మరణాల సంఖ్యను కోలుకున్నవారి సంఖ్యతో భాగించడం ద్వారా రికవరీ రేటు లెక్క కట్టారు. అయితే, పరిష్కారమైన కేసుతో విభజించాలని డబ్య్లుహెచ్వో చెబుతున్నది. కాని మొత్తం కేసు సంఖ్యతో మరణాలను భాగించి రికవరీ రేటు లెక్క కడుతుండటం వల్ల లెక్కల్లో తేడా వస్తోంది. ప్రతి 30, 35 రోజుకొకసారి పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్న పరిస్థితి.ఈ విదంగా చూస్తే అక్టోబర్ చివరకు మరో 80వేల మరణాలు సంభవించవచ్చు. ప్రతి పది లక్షల మందిలో 3328 మందికి కరోనా మాత్రమే పాజిటివ్ వస్తున్నదనీ, 55మరణాలు నమోదవుతున్నాయని ఆరోగ్య మంత్రి చెప్పిన లెక్కలు కూడా సమగ్రమైనవి కావని చెప్తున్నారు. అదే నిజమైతే అంత వేగంగా రికవరీ రేటు ఉండేది కాదు. కోవిడ్ బారిన పడిన 200 దేశాలను తీసుకుంటే నివారణలో చికిత్సలో భారత దేశం 129 వస్థానంలో వుంది.కనుక ఉపేక్షకు ఎంతమాత్రం అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరమని, పాలకులు సైతం మరింత పటిష్టమైన విధానాలు అవలంభించాలని కోరుతున్నారు.