ఢిల్లీ, జనవరి 19: ప్రభుత్వ న్యాయశాఖ అనుమతి లేకుండా జెఎన్యు స్టూడెంట్స్ యూనియన్ మాజీ నాయకుడు కన్నయ్య కుమార్పై ఛార్జిషీటు దాఖలు చేయడాన్ని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం ఢిల్లీ హైకోర్టు కన్నయ్య కేసును విచారించింది.
ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్లో 2016 ఫిబ్రవరిలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 1200 పేజీల అభియోగ పత్రాన్ని పాటియాలా హౌస్ కోర్టులో ఈ నెల 14న దాఖలు చేశారు.
పది రోజుల్లోగా న్యాయ విభాగం నుండి అనుమతులు తీసుకురానున్నట్లు ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసును ఫిబ్రవరి ఆరవ తేదీకి కోర్టు వాయిదావేసింది.
కన్నయ్య కుమార్పై పోలీసులు దేశద్రోహం నేరం కింద ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కన్నయ్యతో పాటు అప్పటి అతని సహచరులు ఉమర్ ఖలీద్, అనిర్భన్ భట్టాచార్యపై కూడా అభియోగాలు మోపారు. సిపిఐ నాయకుడు డి రాజా కుమార్తె అపరాజితతో పాటు ఎఫ్ఐఆర్లో ఉన్న మరో 36 మంది నేరం చేశారనడానికి రుజువులు దొరకలేదని పోలీసులు పేర్కొన్నారు.
పార్లమెంట్పై దాడి కేసులో అఫ్జల్ గురును ఉరి తీయడాన్ని నిరసిస్తూ మూడేళ్ల క్రితం జెఎన్యు క్యాంపస్లో కన్నయ్య కుమార్ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. అక్కడ భారత్కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారన్నది పోలీసుల అభియోగం. ఈ వివాదంలో ఢిల్లీ పోలీసుల వైఖరి తీవ్ర విమర్శలకు దారి తీసింది. కన్నయ్య కుమార్కు ఒక్క సారిగా క్రేజ్ పెరిగింది.
ఐపిసి సెక్షన్లు 124ఎ, 323, 465, 471, 143, 149, 147, 120బి కింద ఛార్జ్షీట్ నమోదు చేశారు.