కరోనా మహమ్మారిని తరిమికొట్టుందుకు మందులు తయారవుతున్నాయి. వీటిలో కొన్ని క్లినికల్ ట్రైల్స్ లో ఉండగా.. మరికొన్ని ఫలితాలు సాధిస్తున్నాయి. వీటిలో ఇప్పుడు కరోనా యాంటీ వైరల్ డ్రగ్ ‘ఫావిపిరవిర్’ చేరుతోంది. వీటి విక్రయాలకు అనుమతి లభించిందని పుణెకు చెందిన బ్రింటన్ ఫార్మా ప్రకటించింది. ఇందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి కూడా ఇచ్చిందని వెల్లడించింది.
‘ఫావిటన్’ పేరుతో 200 మి.గ్రా టాబ్లెట్లను అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ తెలిపింది. ఈ టాబ్లెట్లను రూ.59కే విక్రయిస్తామని బ్రింటన్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్లెన్మార్క్కు చెందిన ఫాబిఫ్లూ డ్రగ్ రూ.75కు అందుబాటులో ఉంటే ఫావిటన్ టాబ్లెట్ ఇంకా తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. తక్కువ నుంచి మధ్యస్థ కరోనా లక్షణాలున్న వారి చికిత్సకు ‘ఫావిపిరవిర్’ మంచి ఫలితాలిస్తోందని.. క్లినికల్ గా కూడా సక్సెస్ అయిందని బ్రింటన్ తెలిపింది. ఇందుకు సాక్ష్యాలు కూడా ఉండటంతో ఇండియాలో అత్యవసర వినియోగానికి అనుమతి లభించిందని తెలిపింది.
అన్ని కోవిడ్ చికిత్సా కేంద్రాల్లో ఫావిటన్ను అందుబాటులో ఉంచుతామని బ్రింటన్ ఫార్మా సీఎండీ రాహుల్ కుమార్ దర్దా చెప్పారు. దీన్ని విదేశాలకు ఎగుమతి చేసే ఉద్దేశం కూడా ఉందని ఆయన అంటున్నారు. జపాన్కు చెందిన ఫ్యుజీ ఫిల్మ్ కార్పొరేషన్కు అనుబంధ సంస్థగా ఉన్న ఫ్యూజీఫిల్మ్ టొయమా కెమికల్ కంపెనీ ఫావిపిరవిర్ ను ‘అవిగాన్’ బ్రాండ్తో విక్రయిస్తోంది.