కరోనా వైరస్ మనకు వ్యాప్తి చెందగానే 3 నుంచి 4 రోజుల వ్యవధిలో లక్షణాలు కనిపిస్తాయన్న సంగతి తెలిసిందే. అదే విషయాన్ని ఇప్పటి వరకు వైద్య నిపుణులు చెబుతూ వచ్చారు. అందుకనే కొన్నిచోట్ల 3 నుంచి 5 రోజుల పాటు క్వారంటైన్ గడువు విధిస్తున్నారు కూడా. ఇక లక్షణాలు లేని వారిని కనిపెట్టడం కష్టంగా మారింది. అయితే సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల ప్రకారం.. కొందరిలో 8 రోజుల తరువాత కూడా కోవిడ్ లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.
చైనాకు చెందిన పెకింగ్ యూనివర్సిటీ సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల ప్రకారం.. ఒక వ్యక్తికి కోవిడ్ వ్యాప్తి చెందాక ఇప్పటి వరకు 3 నుంచి 4 రోజుల వ్యవధిలో లక్షణాలు కనిపిస్తాయని అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ 8 రోజుల తరువాత కూడా కొందరిలో లక్షణాలు కనిపిస్తాయని నిర్దారించారు. అందువల్ల కోవిడ్ అనుమానితులను కచ్చితంగా 8 రోజుల పాటు నిర్బంధ క్వారంటైన్లో ఉంచాలని అంటున్నారు. కోవిడ్ వ్యాప్తి చెందాక 8 రోజుల వరకు లక్షణాలు కనిపించకపోయినా.. తరువాత కనిపించే అవకాశం ఉందని.. పలువురు కోవిడ్ పేషెంట్లను పరిశీలించాక తమకు అర్థమైందని సైంటిస్టులు తెలిపారు.
సైంటిస్టులు చేపట్టిన ఈ పరిశోధనలకు చెందిన వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ అనే జర్నల్లోనూ ప్రచురించారు. కాగా వారు చెబుతున్న ప్రకారం.. కరోనా వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ 7.75 రోజులని తేలిందన్నారు. కొందరు పేషెంట్లలో ఇంకుబేషన్ పీరియడ్ 14.28 రోజులుగా కూడా ఉందన్నారు. అందుకని కరోనా అనుమానితులను కనీసం 8 రోజులు, గరిష్టంగా 14 రోజులు క్వారంటైన్లో ఉంచాల్సిందేనని అంటున్నారు.