తెలుగు రాష్ట్రాల్లో కరోనా టెస్ట్ ల ధరలను ప్రభుత్వాలు సవరించాయి. గతంలో వేలలో ఉన్న కరోనా టెస్ట్ పరీక్షల ధరలు ఇప్పుడు వందల్లోకి వచ్చేశాయి. ఇటు ఏపిలో ప్రభుత్వం ఇప్పటి వరకూ రెండు సార్లు కోవిడ్ పరీక్షల ధరలను సవరించగా, అటు తెలంగాణ ప్రభుత్వం రెండవ సారి సవరించింది. ఏపిలో మొదటి నుండి కరోనా పరీక్షలను ఎక్కువగా చేస్తూ రికార్డును నెలకొల్పగా తెలంగాణలో మాత్రం హైకోర్టు ఆదేశాల అనంతరం టెస్ట్ ల సంఖ్య పెంచింది.
ఇంతకు ముందు తెలంగాణలో ల్యాబ్ లో చేసే ఆర్ టీ పిసీఆర్ పరీక్షలకు 850లు, ఇంటి వద్ద చేసే వాటికి రూ.1200లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం రెండవ సారి ధరలను సవరణ చేసింది. ల్యాబ్ లో చేసే ఆర్ టీ పిసీఆర్ పరీక్షల ధరను రూ.500లు, ఇంటి వద్ద చేసే కోవిడ్ టెస్టు ధరను రూ.750లుగా నిర్ణయించింది.
కాగా ఏపీ విషయానికి వస్తే ఇంతకు ముందు రూ.1900ల నుండి రూ.2900లు వరకూ ఉండగా ఆ టెస్ట్ ధరలను నేడు రూ.475లు నుండి రూ.499లకు తగ్గించింది. ప్రస్తుతం ఏపిలో కరోనా కేసుల నమోదు బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో పేద, మద్యతరగతి వర్గాల వారు తక్కువ ధరలకు కరోనా టెస్ట్లు ప్రైవేటు ల్యాబ్లో చేయించుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. అయితే కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న సమయంలో టెస్ట్ల ధరలు తగ్గించి ఉంటే ఎక్కువ మంది ప్రయోజనం పొందే వారు. ఇప్పుడు కేసుల సంఖ్య తగ్గిన తరువాత కరోనా టెస్ట్ ధరల తగ్గింపుపై ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది. ఇంతకు ముందు కరోనా టెస్ట్ కిట్లు కొరత ఉండేదని ఇప్పుడు వాటి ఉత్పత్తి బాగా పెరిగి పోయి తక్కువ ధరలకు అవి అందుబాటులోకి రావడంతో కరోనా టెస్ట్ ల ధరలు భాగా తగ్గాయని అంటున్నారు.