Covid Cases: దేశంలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతోంది. భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా దేశంలో 2,68,833 కోవిడ్ కేసులు నమోదు కాగా 1,22,684 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 14,17,820 ఉన్నాయి. రోజువారి కోవిడ్ పాజిటివ్ రేటు 16,66 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో పక్క తెలుగు రాష్ట్రాల్లో ఏపిలో పండుగ వేళ భారీగా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో కొత్తగా 1,963 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 5వేలకు చేరువ అయ్యాయి.
Covid Cases: ఏపిలో తాజాగా 4,955 కేసులు
ఏపిలో గడచిన 24 గంటల్లో 35,673 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,955 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బులిటెన్ విడుదల చేశారు. విశాఖ, చిత్తరు జిల్లాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదు అయ్యాయి. విశాఖలో 1,103 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,039 కేసులు వెల్లడయ్యాయి. ఇదే సమయంలో 397 మంది కరోనా నుండి కోలుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. యాక్టివ్ కేసులు 22,870కి చేరాయి.
మాస్కులు ధరించకుండా వేడుకల్లో
అనేక మంది ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఏపికి చెందిన మంత్రులు కొడాలి నాని, అవంతి శ్రీనివాస్ తదితరులు కరోనా బారిన పడ్డారు. సంక్రాంతి పండుగ సంబరాలు జరుగుతున్న వేళ కరోనా విజృంభిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటించాలని హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రముఖులు మొదలుకొని సామాన్య ప్రజలు సంబరాల్లో మాస్కులు ధరించకుండానే పాల్గొంటున్నారు. ఏపిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.