ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ రాష్ట్రంలో కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చిన సంగతి తెలిసిందే. దీని వల్ల ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ప్రైవేటు హాస్పిటల్స్లోనూ చికిత్స పొందేందుకు వీలు ఏర్పడింది. అయితే తెలంగాణలో మాత్రం కోవిడ్ను ఇంకా ఆరోగ్యశ్రీలో చేర్చలేదు. దీంతో తమకు కూడా ఏపీలాగే సదుపాయం కల్పించాలని తెలంగాణ ప్రజలు రాష్ట్ర సీఎం కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నారు.
జూలై 8వ తేదీన ఏపీలో కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్యశ్రీ కిందకు తెచ్చింది. ఈ క్రమంలో ఆరోగ్య శ్రీ లబ్ధిదారులు ప్రైవేటు హాస్పిటల్స్లో కోవిడ్ చికిత్స తీసుకున్నా.. అందుకు అక్కడి ప్రభుత్వమే ఖర్చులు భరిస్తోంది. దీని వల్ల అక్కడి ఎంతో మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు మేలు కలుగుతోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కూడా కరోనాకు ఉచిత చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.
అయితే మరోవైపు తెలంగాణలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ప్రైవేటు హాస్పిటళ్లు కరోనా చికిత్స కింద భారీ మొత్తంలో ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఆరోగ్య శ్రీ తమకు ఉందని, దాని కింద ఉచితంగా చికిత్స అందివ్వాలని లబ్ధిదారులు ప్రాధేయపడుతున్నా.. హాస్పిటల్స్ మాత్రం అందుకు నిరాకరిస్తున్నాయి. కోవిడ్ 19 కాదు.. అసలు ఇతర అనారోగ్య సమస్యలకు ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స అందించేందుకు కూడా ప్రైవేటు హాస్పిటల్స్ ఇష్టం చూపడం లేదు. ఎందుకంటే.. ఆరోగ్య శ్రీ కింద లబ్ధిదారులకు చికిత్స అందించినందుకు గాను ఇప్పటికే హాస్పిటళ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున బకాయిలు రావల్సి ఉంది. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆరోగ్య శ్రీ రీయెంబర్స్మెంట్ మొత్తం అందలేదని, కనుకనే ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించడం లేదని ప్రైవేటు హాస్పిటల్స్ చెబుతున్నాయి.
కాగా దేశంలో తొలిసారిగా సీఎం కేసీఆర్ నిధులు లేవని చెప్పి గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, సీనియర్ సిటిజెన్లకు ఇస్తున్న వేతనాలు, ఇతర మొత్తాలలో కోత విధించారు. ఏపీ సీఎం జగన్ కూడా ఆ విధంగా జీతాలకు కోత పెట్టారు. కానీ ఆయన తరువాత నుంచి ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇచ్చారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి కూడా పూర్తి జీతాలు ఇవ్వకతప్పలేదు. అయితే ఇప్పుడు జగన్ కోవిడ్ను ఆరోగ్య శ్రీ కిందకు తెచ్చారు కనుక.. సీఎం కేసీఆర్ కూడా అలాగే చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?