Covid Vaccine: దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్ ఈ ప్రవేశిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం నిన్న కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 18 ఏళ్లు పైబడిన వారందరూ ఏప్రిల్ 10వ తేదీ (రేపు) నుండి ప్రికాషన్ డోస్ తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు ఈ డోస్ తీసుకునేందుకు అర్హులుగా పేర్కొంది. అయితే ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాల్లోనే ఈ సదుపాయం ఉంటుందని తెలిపింది. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం ఉచితంగా బూస్టర్ డోస్ అందిస్తొంది. ప్రైవేటు వాక్సిన్ కేంద్రాల్లో 18 ఏళ్లు పైబడిన వారు వేయించుకునే టీకాకు కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రికాషన్ డోసు కోసం ప్రత్యేకంగా మళ్లీ నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదనీ, కోవిడ్ యాప్ లోకి వెళ్లి ప్రికాషన్ డోస్ కోసం అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవడం గానీ లేదా నేరుగా ప్రవేటు కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవచ్చని తెలిపింది.
Covid Vaccine: నేటి నుండి ప్రికాషన్ డోస్
ఆదివారం నుండి ప్రికాషన్ డోస్ పంపిణీ జరగనున్న నేపథ్యంలో టీకా ధరలను వ్యాక్సిన్ తయారీ సంస్థలు భారీగా తగ్గించాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్ ధరలు రూ.225 గా ఉండనున్నట్లు ప్రకటించాయి. ప్రైవేటు ఆసుపత్రులకు కోవిషీల్డ్ టీకా డోసు ధర ను రూ.600 ల నుండి 225లకు తగ్గిస్తున్నట్లు సీరమ్ సీఈఓ ఆదర్ పూనావాలా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదే విధంగా కోవ్యాగ్జిన్ టీకా ధర ను రూ.1200 ల నుండి 225లకు తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్లా వెల్లడించారు. అయితే ఈ వ్యాక్సిన్ ధరలకు సర్వీస్ చార్జి అదనంగా పేర్కొన్నారు. సర్వీస్ చార్జీని గరిష్టంగా రూ.150లు మాత్రమే తీసుకోవాలని ప్రైవేటు ఆసుపత్రులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. సర్వీస్ చార్జితో కలుపుకుని రూ.375లు చెల్లించి ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాల్లో రేపటి నుండి 18 ఏళ్లు పైబడిన వారు బూస్టర్ డోస్ వేయించుకోవచ్చు.