కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం జనాలకు అనేక అపోహలు నెలకొన్నాయి. అలాగే చాలా మంది భయపడుతున్నారు కూడా. ఒకసారి కరోనా సోకి నయమైతే మళ్లీ కరోనా వస్తుందేమోనని వారు సందేహిస్తున్నారు. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని వైద్య నిపుణులు తెలిపారు. కరోనా వచ్చి తగ్గిన వ్యక్తులకు మళ్లీ కరోనా వ్యాపించినట్లు ప్రపంచంలో అసలు ఇప్పటి వరకు ఎక్కడా నమోదు కాలేదని తెలిపారు.
ఎపిడెమియాలజీ అండ్ సర్వేలెన్స్ పై ఐసీఎంఆర్ పరిశోధన టాస్క్ ఫోర్స్లో పాల్గొన్న డాక్టర్ గిరిధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ పైన తెలిపిన వివరాలను వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో కరోనా లక్షణాలు ఇప్పటి వరకు కనిపించలేదని, లక్షణాలు కనిపిస్తేనే కరోనా మళ్లీ వచ్చినట్లు భావించాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారు మళ్లీ కరోనా బారిన పడినట్లు ఎక్కడా వార్తలు రాలేదని తెలిపారు. అయితే ఇటీవల చైనాలో కరోనా వచ్చి తగ్గిన వారిలో మళ్లీ లక్షణాలు కనిపించినట్లు వార్తలు వచ్చాయని కానీ ఆ వార్తల్లో నిజం లేదని కేఈఎం హాస్పిటల్ పల్మనాలజీ విభాగ వైద్య నిపుణుడు డాక్టర్ స్వాప్నిల్ కులకర్ణి అన్నారు.
కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ కొందరిలో దాని తాలూకు అవశేషాలు ఉంటాయని డాక్టర్ కులకర్ణి తెలిపారు. అయితే ఆ అవశేషాల వల్ల వారికి ఎలాంటి హానీ ఉండదని, అవి శరీరం నుంచి పూర్తిగా వెళ్లిపోయేందుకు 1 నుంచి 2 నెలల వరకు సమయం పడుతుందని, ఆ సమయంలో ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేస్తే కోవిడ్ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయని, అంత మాత్రం చేత వారికి కోవిడ్ మళ్లీ వచ్చినట్లు భావించాల్సిన పనిలేదని అన్నారు. అందువల్ల ఒక్కసారి కరోనా బారిన పడిన వారు కోలుకున్నాక తిరిగి కరోనా వస్తుందని భయపడాల్సిన పనిలేదన్నారు. అయినప్పటికీ వారు కోవిడ్ జాగ్రత్తలను పాటించక తప్పదని అన్నారు.