(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ ఏపీ పర్యటించారు. అనంతపురం జిల్లా లేపాక్షిని ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. సజ్జనార్ ప్రస్తుతం రెండు రోజుల పాటు సెలవుల్లో ఉన్నారు. దీంతో ఆయన తన సొంత రాష్ట్రం కర్నాటకలోని హుబ్లీ వెలుతూ మార్గమద్యంలో లేపాక్షి ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. వీరభద్రస్వామి ఆలయానికి సంప్రదాయ పంచెకట్ట, లాల్జీ ధరించి, కుటుంబీకులతో కలిసి సజ్జనార్ వచ్చారు. కర్ణాటకకు చెందిన సజ్జనార్ కుటుంబానికి వీరభద్రస్వామి ఇలవేల్పు. వీరభద్రునికి, దుర్గాదేవికి సజ్జనార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన లేపాక్షి ఆలయానికి వచ్చారని తెలియడంతో భక్తులతో పాటూ స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సీపీని చూసేందుకు ఎగబడ్డారు.. ఆయనతో కరచాలనం కోసం కొందరు ప్రయత్నించారు.. ఆయన కూడా వారిని నవ్వుతూ పలకరించారు. యువతీ, యువకులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
ప్రతి ఏటా తన సొంత రాష్ట్రం కర్ణాటకలోని హుబ్లీ, అలాగే తన సొంత ఊరికి వెలుతున్న ప్రతిసారీ లేపాక్షి ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా చేసుకున్నారు. దర్శనానంతరం అక్కడి నుంచి సొంత ఊరికి బయల్దేరి వెళ్లారు. ఇటీవల దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్ కౌంటర్ అనంతరం సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన సంగతి తెలిసిందే.