బీజెపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్కు తీవ్ర కోపం వచ్చింది. దీంతో ఆయనను కేసులు తప్పవంటూ తీవ్రంగా హెచ్చరించారు. రాజాసింగ్ పై సీపీ సజ్జనార్ ఎందుకు గుస్సా అయ్యారు. ఇంతకు రాజాసింగ్ ఏమన్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్ర నుండి హైదరాబాద్కు ఆవులను తరలిస్తున్న లారీని నిన్న రాత్రి రాజా సింగ్ పట్టుకున్నారు. చౌటుప్పల్ చెక్ పోస్టు వద్ద లారీని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీస్ శాఖపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ పోలీసులు డబ్బుల కోసం ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు అంటూ సంచలన ఆరోపణ చేశారు. దీనిపై సీపీ సజ్జనార్ స్పందించాలనీ డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే తామే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు రాజా సింగ్.
రాజా సింగ్ వ్యాఖ్యలపై సీపీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. పోలీసుల నైతికత దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదంటూ హెచ్చరించారు సజ్జనార్. బీజెపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. పోలీసులపై అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ సీపీ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ సీపీ హెచ్చరించారు. పోలీసుల మీద, డీజీపీ మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని అన్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని సజ్జనార్ పేర్కొన్నారు.