అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన సిఎం జగన్కు లేఖ రాశారు.
ఏపికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయాలని వైసిపి ఎంపిలకు సూచించడం హర్షనీయం, అభినందనీయమన్నారు. 2014-15 లోటు బడ్జెట్ నిధులు కేంద్రం ఇప్పటి వరకూ ఇవ్వలేదనే విషయాన్ని రామకృష్ణ గుర్తు చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులలో కోత విధిస్తుందని రామకృష్ణ అన్నారు. విభజన హామీలలో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదని పేర్కొన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని బిజెపి నేతలు బహిరంగంగానే చెబుతున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో తక్షణం అమరావతిలో గానీ ఢిల్లీలో గానీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రామకృష్ణ కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై సమిష్టిగా ఒకే మాటగా పార్లమెంట్ సమావేశాలలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కృషి చేయాలని ఆయన జగన్కు విజ్ఞప్తి చేశారు.