గుంటూరు: వైసిపి ప్రభుత్వం మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం మానుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. ఆదివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అన్ని జిల్లాల నుంచి సమాచారం తీసుకుని నివేదిక తయారు చేసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఇస్తామని రామకృష్ణ తెలిపారు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదాపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. వైసిపి ఎంపీలు పార్లమెంట్ క్యాంటీన్లో బిర్యానీలు తిని నిద్రపోతున్నారా అంటూ విమర్శించారు. కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన వీరు ఇప్పుడు ఎందుకు పోరాటం సాగించడం లేదని రామకృష్ణ నిలదీశారు.