2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టు పార్టీలతో చేతులు కలిపి నానా హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టీడీపీ- బీజేపీ పార్టీలను పక్కన పెట్టి కమ్యూనిస్టు అదేవిధంగా బీఎస్పీ పార్టీలతో కలిసి 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి తన పార్టీని బరిలోకి దింపి భారీ ఓటమిని ఎదుర్కోవటం జరిగింది.
కానీ ఆ టైంలో వామపక్షాల నాయకులతో కలసి పవన్ వేదికలు పంచుకొని కమ్యూనిజం తన బ్లడ్ లో ఉన్నట్టు చేగువేరా పై అభిమానం చూపుతూ భారీ డైలాగులు వేయటం అందరికి తెలిసిందే. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ రివర్స్ గా కమ్యూనిజానికి వ్యతిరేకంగా మతతత్వ పార్టీ అని పిలువబడే బీజేపీతో చేతులు కలిపి ప్రస్తుతం రాణిస్తూ ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పవన్ తాజా రాజకీయాలపై సిపిఎం కార్యదర్శి పి. మధు వైరల్ కామెంట్ చేశారు. భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు. బిజెపి పార్టీతో చేతులు కలిపి డబల్ గేమ్ రాజకీయాలు, ప్రమాణాలు పాటిస్తున్నారని మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ లేబొరేటరీస్ ఏర్పాటు బీజేపీ ఇక్కడ వ్యతిరేకిస్తూ ఢిల్లీలో మద్దతు పలుకుతోందని ఆయన విమర్శించాడు. ఇటువంటి తరుణంలో బిజెపి పార్టీ పంచన చేరి నంగనాచి మాటలు పవన్ మాట్లాడుతున్నాడు.. ఈ ప్రాంత ప్రజలు అతని మాటలు నమ్మి మోసపోవద్దని సీపీఎం మధు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ప్రజల ఆరోగ్యానికి ముప్పు గలిగే దివిస్ పరిశ్రమను తరలించకపోతే సీపీఎం ఉద్యమం చేయడానికి రెడీగా ఉందని, అదేవిధంగా స్థానికుల పై పెట్టిన కేసును ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని, జైల్లో ఉన్న వారిని రిలీజ్ చేయాలని ప్రభుత్వంపై మండిపడుతూ మధు డిమాండ్ చేశారు.