కాకినాడ: డిసెంబర్ 29: కాకినాడ డీప్ వాటర్ పోర్టులో ప్రమాదం జరిగింది. భారీ ఓడల నుంచి సరుకు కిందకు దించేందుకు ఉపయోగించే ఆఫ్షోర్ క్రేన్లు రెండు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు, 10 మందికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొంత మంది కార్మికులు చిక్కుకొని ఉన్నారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికుడిని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వట్టిపల్లి లక్ష్మణ్ కుమార్ (35)గా గుర్తించారు. గాయపడిన మరో కార్మికుడు పోతిలేడి ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల సంభవించిన తుపాను కారణంగా దెబ్బతిన్న క్రేన్ను మరమ్మతు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. భారీ క్రేన్లు కుప్పకూలిపోవడంతో అక్కడి కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ (కేఎస్పీఎల్) సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.