ఆ యువకుడు కరుడు గట్టిన నేరస్తుడు కాదు..కానీ హత్య కేసులో నిందితుడు అయిపోయాడు. అందుకు కారణం చెడు వ్యసనాలకు బానిస అవ్వడమే. చెడు వ్యసనాలు వ్యక్తి ఎంత నేర ప్రవృత్తికి, పతనానికి దారి తీస్తుందో ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
నాలుగు రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం తువ్వచిలుకరాయుడుపాలెంలో ఎనిమిదేళ్ల బాలిక ఊరి బయట ఒ పాకలో నుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ బాలిక ముఖంపై దిండు పెట్టి ఉండటంతో యువకులు అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసి ఉంటారని బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు భావించారు. మృతి చెందడానికి ముందు ఆ బాలికకు ఇద్దరు యువకులు బిస్కెట్ ప్యాకెట్ కొని పెట్టారని చూసిన వారు పోలీసులకు తెలియజేశారు. తొలుత ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన దర్మాజీగూడెం పోలీసులు.. గ్రామస్తులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాలు, ఘటనా స్థలంలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సేకరించిన ఆధారాలు ఆధారంగా హత్య కేసుగా మార్పు చేసి దర్యాప్తు చేశారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు.
మంగళవారం చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐ లక్ష్మీనారాయణలు మీడియా సమావేశంలో హత్య కేసు నిందితుడుని చూపి వివరాలు వెల్లడించారు. ఆ బాలికకు మేనమామ వరుస అయ్యే కాట్రు వంశీ ఏలియాస్ బన్ను అనే యువకుడు హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి అయ్యింది. ఇంతకూ ఆ యువకుడు ఈ హత్య ఎందుకు చేశాడంటే.. ప్రధానంగా చెడు వ్యవసనాలు.
అ యువకుడికి మద్యం సేవించడంతో పాటు క్రికెట్ బెట్టింగ్ ఆడే అలవాటు ఉంది. ఇటీవల ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లో రెండు సార్లుగా వెయ్యి రూపాయల చొప్పున రెండు వేలు పోగొట్టుకున్నాడు. చేసిన అప్పు తీర్చడానికి, మళ్లీ బెట్టింగ్ ఆడటానికి అతని వద్ద డబ్బులు లేవు. రోడ్డు మీద ఆ యువకుడు నడుచుకుంటూ వెళుతుండగా ఈ బాలిక కనిపించింది. ఈ బాలిక చెవులకు ఉన్న రింగ్లను కొట్టేస్తే మళ్లీ క్రికెట్ బెట్టింగ్ ఆడవచ్చని భావించాడుట. ఆ బాలికకు బిస్కెట్ ప్యాకెట్ కొని ఇచ్చి తనకు ఒక సిగరెట్, అగ్గిపెట్టే తీసుకుని అక్కడ ఇంటికి రమ్మని చెప్పడంతో బాలిక వెళ్లి ఆ యువకుడు ఇచ్చింది. ఆ తరువాత ఆమెను మాటల్లో పెట్టి ఆ బాలిక చెవుల రింగులు లాక్కునేందుకు ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో ఎవరైనా వస్తారని భయపడి దిండును ఆ బాలిక మొహంపై అదిమిపెట్టడంతో చనిపోయింది. ఆ తరువాత ఆమె చెవి రింగ్లు రెండు తీసుకున్నాడు. కేవలం రెండు వేల రూపాయలు క్రికెట్ బెట్టింగ్ అప్పు తీర్చడం అభంసుభం తెలియని చిన్నారిని హత్య చేసి కటకటాల పాలైయ్యాడు ఈ యువకుడు.