(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాష్ట్రంలో వాయుగుండం కారణంగా మూడు రోజులుగా కురిసిన వర్షాలు, భారీ వరద కారణంగా వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టంపై యుద్ధ ప్రాతిపదికన ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్ననే వర్షాలు వరదల పై అధికారులతో సమీక్ష జరిపిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, మినుము, చెఱకు తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. మొత్తం తొమ్మిది జిల్లాల్లో 71,821 హెక్టార్ల లోని పంట నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి అందించింది. ఉదయ గోదావరి, విశాఖ, కృష్ణాజిల్లాలో అత్యధికంగా పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. తొమ్మిది జిల్లాల్లో 24 రకాల పంట లకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది.
వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం… వరి 54,694, పత్తి 12,047, మినుము 1600, చెరకు 310, వేరుశనగ 836 హెక్టార్ల పంట దెబ్బతిన్నట్లు పేర్కొన్నది. కడప జిల్లాలో ఇసుక మేట వేసిన కారణంగా 476 హెక్టార్లలో, భూమి కోత కారణంగా 53 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలో పేర్కొన్నది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 29, 943, పశ్చిమ గోదావరి జిల్లాలో 13,976, కృష్ణాజిల్లాలో 12,466 హెక్టార్లలో పంటలు పంటలు దెబ్బతినగా, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 158 హెక్టార్లలో పంట నష్టం జరిగింది.