సిబిఐ అంతర్గత పోరు మొదలయినప్పటి నుంచీ కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సివిసి) కెవి చౌదరి పేరు కూడా వార్తల్లో ఎక్కువ వస్తోంది. తాజాగా కాంగ్రెస్ ఆయన వెంటనే ఆ పదవి నుంచి తప్పుకోవాలనీ, లేని పక్షంలో ప్రధానమంత్రే చౌదరిని తొలగించాలనీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ను అందుకు ప్రేరేపించిన అంశం జస్టిస్ పట్నాయక్ చేసిన ప్రకటన. సిబిఐ డైరక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగించి ఉండాల్సింది కాదని జస్టిస్ పట్నాయక్ పేర్కొన్నారు.
సిబిఐలో వర్మ తర్వాతి స్థానంలో ఉన్న రాకేష్ ఆస్థానా వర్మపై చేసిన ఆరోపణలను సివిసి విచారించారు. అంతకు ముందు ఆస్థానా కాన్ఫిడెన్షియల్ రికార్డులో వర్మ కొన్ని రిమార్క్స్ రాశారు. సుప్రీంకోర్టు వర్మ బదిలీని రద్దు చేసిన తర్వాత ప్రధాని నేతృత్వంలోని కమిటీ సమావేశమై ఆయనను తిరిగి బదిలీ చేసింది. దానికి ఆ కమిటీ సివిసి హోదాలో చౌదరి ఇచ్చిన నివేదికపై ఆధారపడింది. ఈ విషయంలో సివిసి దర్యాప్తును జస్టిస్ పట్నాయక్ పర్యవేక్షించారు. దర్యాప్తు సమయంలో చౌదరి తన ఇంటికి వచ్చి ఆస్థానాపై చేసిన రిమార్క్స్ను ఉపసంహరించుకోవాలని వత్తిడి తెచ్చారనీ, అలా చేస్తే ఇక సమస్యలన్నీ సర్దుకుంటాయని హామీ ఇచ్చారనీ వర్మ జస్టిస్ పట్నాయక్కు తెలిపారు. ఆ విషయం బహిర్గతం అయిన మీదట కాంగ్రెస్ చౌదరి బర్తరఫ్ను డిమాండ్ చేసింది.
చౌదరి వివాదాలకు కొత్తేం కాదు. నిజానికి సివిసిగా ఆయన నియామకమే పెద్ద వివాదం. చౌదరిని అవినీతి పుట్టగా అభివర్ణిస్తూ, ఆయనను సివిసిగా నియమిస్తే దేశానికి అంతకు మించిన దౌర్భాగ్యం ఉండదని ప్రముఖ న్యాయవాది రామ్జెత్మలానీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆయన ఈ విషయంపై ముందు ప్రధానికి వరసగా లేఖలు రాశారు. తన లేఖలు చెవిటివాడి ముందు శంఖం పూరించడంలా తయారయ్యేసరికి చివరికి రాష్ట్రపతికి రాశారు.
బిజెపి ఎంపి అయిన సుబ్రమణ్యస్వామి కూడా చౌదరి నియామకాన్ని వ్యతిరేకించారు. చౌదరి నియామకం కోసం ప్రధాని దగ్గర గట్టిగా పట్టుపట్టింది ఆర్ధిక మంత్రి అరుణ జైట్లీ. ప్రధానమంత్రి, హోంమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడితో కూడిన కమిటీ సివిసిని నియమిస్తుంది. సుబ్రమణ్యస్వామి ప్రధానికి లేఖ రాస్తూ, జైట్లీ జోక్యాన్ని ప్రశ్నించారు.
మరో సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా చౌదరి నియామకాన్ని ప్రాధమిక దశలోనే వ్యతిరేకించారు. నియామకం జరిగిన తర్వాత ఆయన కోర్టుకు వెళ్లారు. స్టాక్గురు పోంజీ స్కామ్లో ఆదాయం పన్ను శాఖ ఉన్నతాధికారుల ప్రమేయంపై సిబిఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆ సంస్థ డైరక్టర్ రంజిత్ సిన్హా ఇంటికి చౌదరి చాలా సార్లు వెళ్లినట్లు డైరీలో నమోదయిందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. రంజిత్ సిన్హా, చౌదరి అవినీతి ఆరోపణల నుంచి పరస్పరం క్లీన్ చిట్ ఇచ్చుకున్నారని అందులో ఆరోపించారు.
కెవి చౌదరి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సభ్యుడు (దర్యాప్తు), తర్వాత బోర్డు ఛైర్మన్గా వ్యవహరించారు. ఆ సమయంలో మొయిన్ ఖురేషీ కేసులో సిబిఐ డైరక్టర్ పనితీరును ఆయన దర్యాప్తు చేశారు. చివరికి స్టాక్ గురు కేసులో చౌదరికి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఖురేషీ కేసులో సిబిఐ డైరక్టర్ సిన్హాకు ఆదాయంపన్ను శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది.
పరిశోధకుడు శౌర్య మజుందార్, జర్నలిస్టు పరంజయగుహా తాకుర్తా కలిసి రాసిన లూజ్ పేజెస్ అనే పుస్తకంలో దర్యాప్తు సవ్యంగా జరిగిఉంటే రెండు కేసులు దేశం గతిని మార్చి ఉండేవని అంటారు. అందులో ఒకటి బిర్లా – సహరా డైరీ కేసు. సహారా కంపెనీలో ఆదాయం పన్ను శాఖ 2012-13 సంవత్సరాల్లో జరిపిన సోదాల్లో కొన్ని పత్రాలు దొరికాయి, వాటిల్లో ఒకచోట గుజరాత్ ముఖ్యమంత్రికి బిర్లా కంపెనీ నుంచి పెద్దమొత్తంలో నిధులు ఇచ్చినట్లు ఉంది. అప్పుడు నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఆదాయం పన్నుశాఖలో ఉన్న చౌదరి ఈ కేసు దర్యాప్తు పర్యవేక్షించారు.
సహరా డైరీలో గుజరాత్ ముఖ్యమంత్రి ప్రస్తావన ఉన్న పేజీ
తెలుగు వాడైన కొసరాజు వీరయ్య చౌదరి ఇండియన్ రెవిన్యూ సర్వీసు అధికారి. సివిసి పోస్టు ఏర్పడిన తర్వాత ఆ పదవిని అధిష్టించిన మొదటి రెవిన్యూ సర్వీసు అధికారి చౌదరి. అంతకు ముందు ఆ పోస్టులో ఎప్పుడూ ఐఎఎస్ అధికారులే నియమితులయ్యారు. 2015లో సివిసిగా పిజె థామస్ నియామకాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు, వేలెత్తి చూపడానికి వీలు లేని రికార్డు ఉన్న అధికారినే తదుపరి సివిసిగా నియమించాలని ఆదేశించింది. ఆ గీటురాయికి చౌదరి నిలబడలేరని చాలామంది అభిప్రాయం.