సైబర్ నేరగాళ్లు రోజు రోజుకి పెట్రేగి పోతున్నారు. ఒకప్పుడు కాలేజీ స్టూడెంట్స్ ని టార్గెట్ చేసే వాళ్ళు. స్నేహితుల వివరాలు సేకరించి నకిలీ ఐడి క్రియోట్ చేసి అమ్మాయిలకి వల వేసేవారు. అలా ఎందరో అమ్మాయిలను మోసం చేసి రక రకాలుగా వాడుకునేవారు. అయితే ఇప్పుడు వీరి పంజా సినిమా వాళ్ళ పై పడుతుంది. వీరికి సోషల్ మీడియా అడ్డాగా దొరికింది. దీంతో సినిమా సెలబ్రిటీలను ఆటాడుకుంటున్నారు. ప్రముఖ దర్శకుల, హీరోల పేర్లు, ఫోటోలతో డూప్లికేట్ అకౌంట్స్ ని క్రియోట్ చేసి యువతులని టార్గెట్ చేస్తున్నారు.
ఇందుకు సంబంధించి రీసెంట్ గా సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు మూడు నమోదయ్యాయి. ఇలాంటి నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పూర్తి వివరాలు నిర్ధారించుకోనిదే వ్యక్తిగత వివరాలు, ఫోటోలు పంపిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సెలబ్రెటీలకు సంబంధించి నమోదైన మూడు కేసుల్లో ఒక కేసులో నిందితుడిని పట్టుకున్న అధికారులు మిగిలిన కేసులను సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పేరుతో ఫేస్బుక్లో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి నేను విజయ్ కి పర్సనల్ మేనేజర్ ని అని నమ్మించాడు. అంతేకాదు కొంతమంది అమ్మాయిలతో విజయ్ దేవరకొండ లాగా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో యువతికి ప్రేమ పేరుతో ఎర వేసి కలిసేందుకు హైదరాబాద్కు వచ్చేశాడు. ఈ లోగా విజయ్ దేవరకొండ సంబంధీకులు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
అలాగే ఆర్ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి పేరుతో అమ్మాయిలకు వల వేసిన విషయం కూడా బయటపడింది. అజయ్ భూపతి పేరుతో ఒకడు ప్రొఫైల్ క్రియేట్ చేసి ఫేస్బుక్ ద్వారా అమ్మాయిల వివరాలు సేకరించాడు. పరిచయం చేసుకుని వాట్సాప్ ద్వారా చాటింగ్ చేయడం మొదలెట్టాడు. అజయ్ భూపతిగానే పరిచయం చేసుకున్న వాడు… త్వరలో విజయ్ దేవరకొండ, విశాల్లతో సినిమా తీయబోతున్నానని ఆ సినిమాలలో నటించే అవకాశం ఇస్తానంటు అమ్మాయిల దగ్గర్నుంచి అసభ్యకరమైన ఫోటోలు కూడా సంపాదించి వేధించడం మొదలెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు అజయ్ భూపతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పేరుతోను మోసాలకు పాలుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు.