బంగాళాఖాతంలోని వాయుగుండం శనివారం తీవ్ర వాయుగుండంగా మారి సాయంత్రానికి తుపానుగా తీవ్రతరం చెందనుంది. ఆగ్నేయ బంగాళాఖాతానికి అనుకొని వాయుగుండం కొనసాగుతోందని చెన్నై వాతావరణ కేంద్రం వెల్లడించింది. చెన్నై తీరానికి 1440 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం వాయువ్య దిశగా ప్రయాణించి శనివారం తుపాన్గా మారనుందని పేర్కొంది.
ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య తుపాన్ తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. తుపాన్ ప్రభావంతో తీరం వెంబడి 45 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. తుపాన్ తీరం దాటే సమయంలో మాత్రం గంటకు 90 నుంచి 115 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు.
తుపాన్ కారణంగా తమిళనాడు, కోస్తాంధ్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఏప్రిల్ 30, మే 1 తేదీల్లో ఆయా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పాటు.. అలలు సాధారణం కంటే ఎక్కువగా ఎగసి పడే అకాశం ఉందని తెలుపుతున్నారు.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో శనివారం నుంచి జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని రియట్టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టిజిఎస్) సూచించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన జాలర్లంతా ఈ నెల 28వ తేదీ ఆదివారంలోగా తీరానికి తిరిగి వచ్చేయాలని ఒక ప్రకటనలో పేర్కొంది. వాయుగుండం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, అలలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయని చెప్పింది. ప్రజలు కూడా తీరప్రాంతాలకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. తీరంలో ఆడుకోవడం, సముద్రస్నానాలు మానుకోవాలని స్పష్టం చేసింది.